తెలుగు సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సీనియర్ నటుడు మన్నవ బాలయ్య (94) కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం ఉదయం యూసఫ్గూడలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. 1930 ఏప్రిల్ 9న గుంటూరు జిల్లా అమరావతి సమీపంలోని వైకుంఠపురములో జన్మించిన బాలయ్య.. 300లకు పైగా చిత్రాల్లో నటించారు. పలు సినిమాలకు దర్శకుడిగా, నిర్మాతగా, రచయితగా పనిచేసి తన బహుముఖ ప్రజ్ఞతో చిత్రసీమకు సేవలందించారు. బాలయ్య మరణవార్తతో టాలివుడ్లో విషాదం నెలకొంది.
‘ఎత్తుకు పైఎత్తు’ చిత్రంతో నటుడిగా పరిచయం అయిన బాలయ్య… ఆ తర్వాత చేసిన ‘భాగ్యదేవత, కుంకుమ రేఖ’ చిత్రాలతో మంచి గుర్తింపు దక్కించుకున్నారు. పార్వతీ కల్యాణం, ‘ఇరుగు -పొరుగు, బభ్రువాహన, బొబ్బిలియుద్ధం, పాండవ వనవాసం, పల్నాటి యుద్ధం, వివాహబంధం, శ్రీక్రిష్ణపాండవీయం’ యమలీల, అన్నమయ్య, శ్రీరాములయ్య వంటి చిత్రాలల్లో నటించి మెప్పించారు. సూపర్స్టార్ కృష్ణ నటించిన అల్లూరి సీతారామరాజు చిత్రంలో అగ్గిరాజు పాత్ర పోషించి అలరించాడు.
ఆ తర్వాత ఆయనతో ‘ఈ నాటి బంధం ఏ నాటిదో’, ‘చుట్టాలున్నారు జాగ్రత్త’ వంటి చిత్రాలు నిర్మించారు. చిరంజీవితో ‘ఊరికిచ్చిన మాట’ నిర్మించడమే కాదు, ఆ చిత్రానికి దర్శకత్వమూ వహించారు. ‘శ్రీరామరాజ్యం’లో వశిష్టుని పాత్రలో కనిపించారు. కొంతకాలంగా వయసు సహకరించక పోవడంతో నటనకు దూరమయ్యారు. బాలయ్య మృతిపట్ల టాలీవుడ్ ప్రముఖులు తమ సంతాపం వ్యక్తం చేశారు.