- గ్రూప్ –1, గ్రూప్ –2 పరీక్షల్లో ఇంటర్వ్యూలు రద్దు
- నేడో, రేపో ఉత్తర్వులు జారీ
నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. త్వరలో భర్తీ చేయనున్న గ్రూప్ –1, గ్రూప్ –2తోపాటు ఇతర గెజిటెడ్ ఉద్యోగాల భర్తీలో ఇంటర్వ్యూలను (మౌఖిక పరీక్ష) రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనను టీఎస్పీఎస్సీ కూడా ఆమోదించింది. దీనిపై నేడో, రేపో ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ కానున్నాయి. దీంతో రాత పరీక్ష ఫలితాల ఆదారంగానే ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. పోటీ పరీక్షల్లో మరీ ముఖ్యంగా గ్రూప్ –1, గ్రూప్ –2 పరీక్షల్లో ఇంటర్వ్యూల వల్ల తీవ్ర జాప్యం జరగడంతోపాటు అభ్యర్థులకు కూడా అనేక అనుమానాలు ఉన్నాయి. ఇంటర్వ్యూల రద్దుతో నియామకాల ప్రక్రియ మరింత పారదర్శకంగా జరిగేందుకు అవకాశం ఉంది.
అభ్యర్థుల హర్షం
అయితే, న్యాయపరమైన చిక్కులు రాకుండా ఉండేందుకు ఫైలును న్యాయశాఖకు పంపడంతోపాటు కేబినెట్ ఆమోదం అవసరమా.. కాదా.. అనే విషయాన్ని లోతుగా పరిశీలించింది. పోటీ పరీక్షల నిర్వహణ విధానంలో మార్పుచేర్పులకు కేబినెట్ ఆమోదం అవసరంలేదని నిర్ధారించుకోవడం, టీఎస్పీఎస్సీ అధికారులతో కూడా జరిపిన సంప్రదింపుల అనంతరం ఇంటర్వ్యూల రద్దుకు గ్రీన్సిగ్నల్ ఇవ్వడంతో ఈ మేరకు జీవో విడుదల చేసేందుకు రంగం సిద్ధమైంది. గ్రూప్ -1, గ్రూప్ –2 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలను రద్దు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయంపై నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.