- తెలంగాణకు రేపు నడ్డా.. ఎల్లుండి రాహుల్ రాక
- 14న కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎంట్రీ
- భారీ ఏర్పాట్లు చేస్తున్న రెండు జాతీయ పార్టీలు
అక్షరశక్తి, హైదరాబాద్: రాష్ట్రంలో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. బీజేపీ, కాంగ్రెస్ అగ్రనేతలు తెలంగాణలో అడుగుపెట్టబోతుండటంతో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. ఈనెల 5న (రేపు) బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పాలమూరుకు రానున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేస్తున్న ప్రజా సంగ్రామ యాత్రలో ఆయన పాల్గొననున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా 14న రాష్ట్రానికి వస్తున్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో నిర్వహించే ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభకు హాజరుకానున్నారు. మరోవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రెండు రోజుల టూర్ షెడ్యూల్ ఖరారైంది. ఈనెల 6న వరంగల్లో నిర్వహించనున్న రైతు సంఘర్షణ సభలో ఆయన పాల్గొననున్నారు. మరుసటి రోజు హైదరాబాద్లో పర్యటించనున్న రాహుల్ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులను కలిసే అవకాశం ఉంది. ఓయూ పర్యటనకు వీసీ అనుమతి ఇవ్వకపోవడంతో కాంగ్రెస్ నేతలు కోర్టును ఆశ్రయించారు. ఓయూలో మీటింగ్ను ఎలాగైనా నిర్వహిస్తామని పీసీసీ నేతలు చెబుతున్నారు. అంతేగాక తెలంగాణ అమరవీరుల కుటుంబ సభ్యులతో రాహుల్ లంచ్కు ఏర్పాట్లు చేశారు. తర్వాత గాంధీ భవన్లో పార్టీ ముఖ్య నేతలతో ఆయన భేటీ కానున్నారు. తమ నేతల పర్యటనలను విజయవంతం చేసేందుకు రెండు జాతీయ పార్టీలు భారీ ఏర్పాట్లు చేస్తున్నాయి.
Must Read