అక్షరశక్తి, హన్మకొండ : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ రాష్ట్ర పర్యటనకు రంగం సిద్ధమైంది. తెలంగాణలో రెండు రోజులపాటు రాహుల్ పర్యటించనున్నారు. నేడు సాయంత్రం హన్మకొండ ఆర్ట్స్ కళాశాల మైదానంలో నిర్వహించనున్న రైతు సంఘర్షణ సభకు హాజరుకానున్నారు. అయితే.. రాహుల్ సభకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్ఎస్జీ కమాండోలతో పాటు జెడ్ ప్లస్ సెక్యూరిటీ భద్రత నడుమ ఆయన ఓరుగల్లులో అడుగుపెట్టనున్నారు. ఇప్పటికే నగరానికి 50 మంది కమాండోలు చేరుకున్నారు. ఒక డీఎస్పీతోపాటు ఏడుగురు ఏసీపీలు, 29 మంది ఇన్స్పెక్టర్లు, 60 మంది ఎస్సైలు, 132 మంది హెడ్కానిస్టేబుల్లు, 836 మంది వివిధ విభాగాల రక్షణ సిబ్బంది భద్రతా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. రాహుల్ చుట్టూ రక్షణ వలయం ఏర్పాటు చేసి, సభ ఆవరణలో బాంబ్ స్క్వాడ్, డాగ్ స్పైడర్లతో నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. అంతేగాక రాహుల్గాంధీ పర్యటన నేపథ్యంలో వరంగల్ కమిషనరేట్ పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. ఇప్పటికే హన్మకొండలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
నేటి పర్యటన షెడ్యూల్ ఇదీ..
మే 6న సాయంత్రం రాహుల్ ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో 4.50 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోనున్నారు. 5:10కి ఎయిర్పోర్ట్ నుంచి హెలికాప్టర్ ద్వారా వరంగల్ బయలు దేరి… 5:45కు కాజీపేటలోని సెయింట్ గాబ్రియెల్ స్కూల్కు చేరుకుంటారు. 6:05 గంటలకు వరంగల్ ఆర్ట్స్ కాలేజీ మైదానంలో ఏర్పాటు చేసిన ‘రైతు సంఘర్షణ సభ’లో పాల్గొననున్నారు. 8 గంటలకు వరంగల్ నుంచి రోడ్డు మార్గం ద్వారా రాత్రి 10:40కి హైదరాబాద్ చేరుకుంటారు. రాత్రి బంజారాహిల్స్లోని హోటల్ తాజ్కృష్ణలో ఆయన బస చేయనున్నారు.
7వ తేదీ షెడ్యూల్ ఇదీ..
మే 7వ తేదీ శనివారం మధ్యాహ్నం 12:30కు హోటల్ తాజ్కృష్ణ నుంచి బయలుదేరి 12:50కి సంజీవయ్య పార్కుకు చేరుకుంటారు. 12:50 నుంచి 1:10 గంటల మధ్య దివంగత మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్యకు నివాళులర్పిస్తారు. 1:15కు అక్కడి నుంచి బయలుదేరి 1:30కి గాంధీభవన్ చేరుకుంటారు. 1:45 నుంచి 2:45 వరకు పార్టీ నాయకులతో సమావేశం అవుతారు. అనంతరం మెంబర్షిప్ కోఆర్డినేటర్లతో ఫొటోలు దిగుతారు. తర్వాత 4 గంటలకు గాంధీభవన్ నుంచి రోడ్డు ద్వారా ఎయిర్పోర్టుకు వెళ్లనున్నారు. 5:50కి ఢిల్లీ తిరుగు పయనం కానున్నారు.