Saturday, July 27, 2024

317 జీవో చుట్టూ రాష్ట్ర రాజకీయం

Must Read

మానసిక ఆందోళనలో బాధిత ఉపాధ్యాయ, ఉద్యోగులు

తెలంగాణలో నూతన జిల్లాలకు పోస్టుల విభజన కొందరికీ వరంగా, మరికొందరికి శాపంగా మారింది. ఉద్యోగుల విభజన, బదిలీల్లో కొత్తజిల్లాల వారీగా స్థానికతను పరిగణనలోకి తీసుకోకుండా ఉమ్మడి జిల్లా యూనిట్‌గా సీనియార్టీనే ప్రతిపాదికగా తీసుకొని బదిలీలు చేయడంపట్ల బాధిత ఉద్యోగ, ఉపాధ్యాయులు గత కొన్ని రోజులుగా ఆందోళన కార్యక్రమాలను ఉదృతం చేశారు. ప్రభుత్వం ఉద్యోగులను జిల్లాల వారీగా కేటాయిస్తున్న సమయంలో సీనియారిటీని ప్రాతిపదికన తీసుకుంది.

సీనియర్లు అంతా పట్టణ ప్రాంతాలను ఎంచుకున్నారు. దీంతో గత రెండు నోటిఫికేషన్ల ద్వారా ఉద్యోగాలు సాధించిన జూనియర్లు తప్పనిసరి పరిస్థితుల్లో మారు మూల ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉదాహరణకు ఉమ్మడి వరంగల్ జిల్లాను పరిశీలిస్తే.. సీనియర్లు అనేక మంది వరంగల్, హన్మకొండ తదితర పట్టణాలకు సమీపంలోని పాఠశాలలను ఎంచుకున్నారు.

దీంతో జూనియర్లు తప్పనిసరి పరిస్థితుల్లో ములుగు, భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో జూనియర్లలో ఆందోళన వ్యక్తమవుతోంది. క్యాడర్ వారీగా ఉద్యోగులను కొత్త జిల్లాలకు బదిలీ చేశారు. ప్రమోషన్లు ఆలస్యంగా పొందిన అనేకమంది కేడర్లో జూనియర్లు కావడం వల్ల సుదూర ప్రాంతాలకు బదిలీ అయ్యారు.

317 జీవో, జోన్ల గురించి తెలుసుకుందాం
కొత్త జిల్లాలు, కొత్త జోన్లు

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత.. పరిపాలన సౌలభ్యం కోసం అప్పటి రాష్ట్రంలోని 10 జిల్లాలను పునర్‌వ్యవస్థీకరించి 33 జిల్లాలుగా విభజించింది రాష్ట్ర ప్రభుత్వం. తొలుత 2016 అక్టోబరులో 31 కొత్త జిల్లాలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. మరో రెండు కొత్త జిల్లాలు 2019 ఫిబ్రవరిలో ములుగు, నారాయణపేట జిల్లాలను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం కొన్ని జిల్లాల్లో 9 మండలాలు ఉంటే, మరికొన్ని జిల్లాల్లో 30 పైగా మండలాలు ఉన్నాయి.

కొత్త జిల్లాలు ఏర్పడిన వెంటనే ఉద్యోగులను వర్క్ టు ఆర్డర్ కింద కొత్త జిల్లాలకు కేటాయించారు. శాశ్వత కేటాయింపులు జరగలేదు. అలాగే.. 2018లో ప్రభుత్వ ఉద్యోగాల కేటాయింపులో రాష్ట్ర ప్రభుత్వం కొత్త జోనల్ వ్యవస్థను ప్రవేశపెట్టింది. రాష్ట్ర విభజనకు ముందు వరకూ తెలంగాణలోని మొత్తం పది జిల్లాలు జోన్-5, జోన్-6 కింద ఉండేవి. ఆ తర్వాత ఏర్పాటు చేసిన మొత్తం 31 జిల్లాలను 7 జోన్లు, 2 మల్టీ జోన్లుగా పునర్‌వ్యవస్థీకరించింది. దీనికి 2021లో కేంద్ర ప్రభుత్వం ఆమోదం లభించింది.

 

జీవో 317 జారీ నేప‌థ్యం..

కొత్త జోన్ల వ్యవస్థ అమలులోకి రావటంతో.. కొత్త జిల్లాలకు, కొత్త జోన్లకు, మల్టీ జోన్లకు.. ఉద్యోగాలను, ఉద్యోగులను సర్దుబాటు చేసే ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం 317 జీవో జారీ ద్వారా ప్రారంభించింది.
ఇందుకోసం 2021 డిసెంబర్ 6వ తేదీన ప్రభుత్వం 317 జీవోను జారీ చేసింది. పాత జిల్లాలు, జోన్లు, మల్టీ జోన్లలోని ఉద్యోగులు.. ఆ పాత జిల్లాలు, జోన్లు, మల్టీ జోన్ల పరిధిలోని కొత్త జిల్లాలు, కొత్త జోన్లు, కొత్త మల్టీ జోన్లలో తాము కోరుకున్న చోటుకు వెళ్లటానికి ఆప్షన్ ఎంచుకునే అవకాశం కల్పించింది. ఈ ఆప్షన్లకు ఆ కేడర్ పోస్టులో సీనియారిటీని ప్రధాన ప్రాతిపదికగా నిర్ణయించింది.

 

అలాగే.. వికలాంగులు, వితంతువులు, క్యాన్సర్ వంటి తీవ్ర అనారోగ్యాలు ఉన్న వారికి ప్రత్యేక ప్రాధాన్యత కింద ఆప్షన్లు ఎంచుకునే వెసులుబాటునిచ్చింది. ఆప్షన్‌లను సమర్పించటానికి జిల్లా స్థాయిలో వారం రోజులు; జోనల్, మల్టీ-జోనల్ స్థాయిలో మూడు రోజుల సమయం ఇచ్చింది. అంటే.. ఉద్యోగులు సీనియారిటీ ప్రకారం తాము కోరుకున్న జిల్లాను ఆప్షన్‌గా ఎంచుకున్నారు. ఉద్యోగులు ఇచ్చిన ఆప్షన్ ప్రకారం ఆయా జిల్లాల్లో ఉన్న ఖాళీల మేరకు అక్కడికి బదిలీ ఉత్తర్వులు ఇచ్చారు.

 

డిమాండ్ ఉన్న ప్రాంతంలో ఖాళీలు నిండిపోయి సీనియారిటీ తక్కువగా ఉన్న వారికి ఆ ఆప్షన్ లభించలేదు. దీంతో వారు కోరుకున్న ప్రాంతంలో.. అది తమ స్థానిక జిల్లానే అయినా – పోస్టింగ్ లభించలేదు. తమ స్థానిక జిల్లా కాకపోయినా వేరే జిల్లాకు శాశ్వత పోస్టింగ్ మీద వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదే అంశం మీద ఉపాధ్యాయ ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది.

ఉద్యోగులు, ఉపాధ్యాయుల ఆందోళన…

ఈ నేపథ్యంలో జీవో 317ను వ్యతిరేకిస్తూ డిసెంబర్ చివరి నుంచి ఉద్యోగులు, ఉపాధ్యాయులు నిరసన చేపట్టారు. ప్రభుత్వం తమను సంప్రదించకుండా ఏకపక్షంగా ఈ నిర్ణయం తీసుకుందని పలు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. స్థానికతను పరిగణనలోకి తీసుకోకపోవడం, తప్పుల తడక సీనియార్టీ జాబితాలు, కేటాయింపు జాబితా తయారీలోనూ లోపాలున్నాయని వారు ఆరోపిస్తున్నారు. పైస్థాయిలో పలుకుబడి ఉన్న కొందరు ప్రభుత్వ ఉపాధ్యాయులు నగరాలు, పట్టణాల్లో పోస్టులు పొందుతున్నారని ఆరోపిస్తున్నారు. వారికన్నా ఎక్కువ సీనియారిటీ ఉన్నా, కొత్త ప్రాంతాల స్థానికులు కాకపోయినా కూడా పలుకుబడి లేని వారిని శాశ్వత కేటాయింపులతో మారుమూల ప్రాంతాలకు బలవంతంగా బదిలీచేస్తున్నారని ఆరోపిస్తున్నారు.

స్థానికతకు చోటు లేకపోవడంతో ఆందోళన ఉధృతం

ఉద్యోగుల బదిలీల్లో స్థానికతను అధికారులు విస్మరిస్తుండటంతో.. కొత్త జోనల్ వ్యవస్థను తీసుకొచ్చిన ప్రధాన లక్ష్యం నీరుగారి పోతోందని ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు.

317 చుట్టూ రాష్ట్ర రాజకీయం

తెలంగాణ రాష్ట్రంలో రాజకీయం ప్రస్తుతం జీవో నంబర్ 317 చుట్టూ కేంద్రీ కృతమైంది. ఉపాధ్యాయ బదిలీలకు సంబంధించి రాష్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన జీవో ఇది. ఈ జీవోకు వ్యతిరేకంగా కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ మరియు ఇతర పార్టీలు తెలంగాణలో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కరీంనగర్ లో బిజేపి రాష్ట్ర అధ్యక్షుడు, స్థానిక పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ నిరసన కార్యక్రమం నిర్వహించారు.

 

ఇది ఈ శీతాకాలంలో రాజకీయంగా వేడిని పెంచింది. బండి సంజయ్ చేపట్టిన జనజాగరణ యాత్ర రసాభాసగా మారింది. కోవిడ్ నిబంధనలు పాటించడం లేదని, అసలు నిరసన కార్యక్రమాలకే అనుమతి లేదని, రాష్ట్రం లో కోవిడ్-19 ఆంక్షలు అమలులో ఉన్నందున నిరసన చేయడం సరికాదని పోలీసులు ఆయన దీక్షను భగ్నం చేశారు. పోలీసులు బండి సంజయ్ ను అరెస్టు చేసి కోర్టుకు హాజరు పరిచారు. కోర్టు అతనికి రిమాండ్ విధించింది. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యం లోని పోలీసులు తీసుకున్న చర్యలపై బిజేపి శ్రేణులు భగ్గుమన్నాయి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బిజేపి ఎం.ఎల్.ఏ లు బండి సంజయ్ ఉన్న జైలు వద్దకు పెళ్లి మాట్లాడి వచ్చారు.

 

రాజకీయ వాతావరణం వేడిగా ఉన్న సమయంలో బిజేపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నాలుగు రోజల పర్యటన నిమిత్తం హైదరాబాద్ కు విచ్చేశారు. ఆయన ఆగమనం సందంర్భంగా బీజేపీ తెలంగాణ శాఖ భాగ్యనగరంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. కోవిడ్ ఆంక్షలు అమలులో ఉన్న కారణంగా పోలీసులు ర్యాలీకి అనుమతి ఇవ్వలేదు. కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి తో పాటు ఇతర పార్టీల నాయకులు కూడా 377 జీవో సవరణపై ఉద్యమం చేస్తున్నారు.

మానసిక ఒత్తిడితో ఉద్యోగ, ఉపాధ్యాయుల ఆత్మహత్యలు

నూతన జిల్లాల కేటాయింపుతో మానసిక ఒత్తిడితో అనేక మంది ఉద్యోగ ఉపాధ్యాయులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తమ సొంత జిల్లాకు ఉద్యోగ కాలంలో ఎన్నటికీ తిరిగి రాలేమని భావించి ఆందోళనకు లోనై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వము భార్యాభర్తలను ఒక దగ్గరికి చేర్చడం, వితంతువులు, అవివాహితులకు ప్రాధాన్యమివ్వడం, పరస్పర బదిలీలు నిర్వహించడం, భవిష్యత్తులో జరిగే బదిలీలు, ప్రమోషన్లలో సొంత జిల్లాకు రావడానికి అవకాశం కల్పించడం చేయాలని, 317 జీఓ సవరణకు చర్యలు చేపట్టాలని బాధిత ఉపాధ్యాయ ఉద్యోగులు కోరుతున్నారు.

 

పిన్నింటి బాలాజీరావు
వరంగల్ జిల్లా అధ్యక్షులు తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (టీపీయూఎస్‌)
9866776286

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img