‘ఆచార్య’లో కాజల్ పాత్రపై డైరెక్టర్ కొరటాల క్లారిటీ
మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్స్టార్ రామ్చరణ్ కలిసి నటించిన చిత్రం ‘ఆచార్య’. ధర్మస్థలి అనే ప్రాంతంలో అమ్మవారి దేవాలయం చుట్టూ తిరిగే కథాంశంతో డైరెక్టర్ కొరటాల శివ ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా కాజల్ అగర్వాల్ను, రామ్ చరణ్ జోడీగా పూజా హెగ్డేను అనుకున్నారు. అయితే ‘ఆచార్య’ సినిమా ట్రైలర్లో కాజల్ కనిపించలేదు. అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్లోనూ ఆమె ప్రస్తావన రాలేదు. దీంతో అసలు సినిమాలో కాజల్ పాత్ర ఉంటుందా.. ? లేదా.. ? అనే వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. తాజాగా ఈ సినిమా ప్రమోషనల్ ఇంటర్వ్యూలో డైరెక్టర్ కొరటాల శివ.. ‘ఆచార్య’ సినిమాలో కాజల్ అగర్వాల్ పాత్ర గురించి క్లారిటీ ఇచ్చారు.
‘‘ఆచార్య’ సినిమాలో ముందుగా హీరోకి జోడీగా కాజల్ అగర్వాల్ను అనుకున్న సంగతి తెలిసిందే. ధర్మస్థలిలో ఓ అమ్మాయి పాత్రకు కాజల్ను తీసుకున్నాం. నాలుగు రోజుల పాటు చిత్రీకరణ కూడా జరిగింది. ఈలోపు కరోనా వచ్చింది. ఆ సమయంలో హీరో పాత్ర నక్సలిజం సిద్ధాంతంతో సాగుతుంది. ఆ పాత్రకు హీరోయిన్ ఉంటే బావుంటుందా? అనిపించింది. హీరోకు హీరోయిన్ ఉండాలి కాబట్టి క్యారెక్టర్ను క్రియేట్ చేసి చేస్తే బాగోదు అనిపించింది. సదరు పాత్రకు పాటలు కూడా లేవు. ముగింపు సరిగా ఉండదు. అంత పెద్ద హీరోయిన్తో అలాంటి పాత్ర చేయిస్తే బాగోదు అనిపించింది. అదే విషయాన్ని చిరంజీవిగారికి చెబితే, కథకు ఏది అవసరం అయితే అది చెయ్ అన్నారు.
అదే విషయాన్ని కాజల్కు అర్థమయ్యేలా చెప్పాను. ఆమె అర్థం చేసుకున్నారు. అందరినీ మిస్ అవుతున్నానని, తప్పకుండా ఫ్యూచర్లో కలిసి సినిమా చేద్దామని అన్నారు. అలా కాజల్ పాత్రను ‘ఆచార్య’ సినిమా నుంచి తొలగించాం’’ అన్నారు డైరెక్టర్ కొరటాల శివ. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించిన ‘ఆచార్య’ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఏప్రిల్ 29న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా భారీ ఎత్తున రిలీజ్ కానుంది.