Saturday, July 27, 2024

హుజురాబాద్ అభివృద్ధిపై చ‌ర్చ‌కు సిద్ధ‌మా ?

Must Read

కేటీఆర్‌కు బీజేపీ నాయ‌కుల స‌వాల్‌

అక్ష‌ర‌శ‌క్తి, క‌మలాపూర్ : హుజురాబాద్ నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధిపై బ‌హిరంగ చ‌ర్చ‌కు సిద్ధ‌మా అని రాష్ట్ర‌మంత్రి కేటీఆర్‌కు బీజేపీ నాయ‌కులు స‌వాల్ విసిరారు. ఎమ్మెల్యే ఈట‌ల రాజేంద‌ర్ హుజురాబాద్ ప్రజల హృదయాల్లో ఎప్ప‌టికీ నిలిచి ఉంటారని స్ప‌ష్టం చేశారు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హుజురాబాద్ అసెంబ్లీ కన్వీనర్ మాడ గౌతంరెడ్డి విచ్చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిన్న కమలాపూర్ మండలానికి విచ్చేసిన కేటీఆర్ ఇక్కడ కొత్తగా ఎలాంటి అభివృద్ధి పనులు చేప‌ట్ట‌లేద‌న్నారు. గ‌తంలో హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఇచ్చిన దొంగ ప్రొసీడింగ్లను చూపెట్టి అభివృద్ధి పేరుతో ప్రజలను తప్పుదారి పట్టిస్తున్న దుర్మార్గమైన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అన్నారు. నిన్న జమ్మికుంట బహిరంగ సభలో కేటీఆర్ మాట్లాడిన మాట తీరులోనే భారత రాష్ట్ర సమితి కి తెలంగాణలో మనుగడ లేదని అతని మాటల్లోనే అర్థమైందని అన్నారు. ఎమ్మెల్యే ఈట‌ల రాజేందర్ విశ్వాసఘాతకుడు అని ఆరోపించడాన్ని తీవ్రంగా ఖండించారు. నిజమైన విశ్వాసఘాతకుడు కేటీఆర్ అన్నారు. ఈట‌ల రాజేందర్ తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రధాన భూమిక పోషిస్తూ, టీఆర్ఎస్ పార్టీని ముందుకు తీసుకెళ్లడానికి ఆర్థికంగా సహాయం అందించార‌న్నారు. అటువంటి వ్యక్తిని అకారణంగా పార్టీ నుంచి బహిష్కరించిన మీరు విశ్వాసం గురించి మాట్లాడుతున్నారా అని ప్ర‌శ్నించారు. గతంలో ఈట‌ల రాజేంద‌ర్ ఆర్థిక మంత్రిగా ఉన్న తరుణంలో హుజురాబాద్ నియోజ‌క‌వ‌ర్గాన్ని, తన స్వగ్రామమైన కమలాపూర్ మండలాన్ని కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి చేశారని కొనియాడారు. ఆ సమయంలో మంజూరు చేసిన , శంకుస్థాపన పూర్తి చేసుకున్న పనులు కరోనా సమయంలో ప్రారంభోత్సవాలు చేసే వెసులుబాటు లేకపోవడంతో ఇప్పుడు వాటికి ప్రారంభోత్సవాలు చేశారే తప్ప కేటీఆర్ కొత్తగా ఎలాంటి అభివృద్ధి పనులు చేప‌ట్ట‌లేదని ఆరోపించారు. కేటీఆర్ కొత్తగా అభివృద్ధి పనులు చేసినట్టు చూపెడితే దేనికైనా సిద్ద‌మ‌ని, కమలాపూర్ చౌరస్తా లేదా జమ్మికుంట చౌరస్తా లేదా ఎక్కడైనా అభివృద్ధిపై చర్చించడానికి తాము సిద్ధంగా ఉన్నామని కేటీఆర్‌కు సవాల్ విసిరారు. భారత ప్రధానిని విమర్శించే స్థాయి కేటీఆర్ లేదని అన్నారు. ఈట‌ల రాజేందర్ హుజురాబాద్ ప్రజల హృదయాల్లో ఎప్ప‌టికీ నిలిచి ఉంటారన్నారు. వచ్చే ఎలక్షన్లో ఈట‌ల రాజేందర్ భారీ మెజార్టీతో గెలుపొంద‌డం త‌థ్మ‌మ‌ని, తెలంగాణ వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో హుజురాబాద్ అసెంబ్లీ కన్వీనర్ మడ గౌతమ్ రెడ్డి, కోకన్వీనర్ మాట్ల రమేష్, కమలాపూర్ మండల అధ్యక్షులు కట్కూరి అశోక్ రెడ్డి, హనంకొండ జిల్లా అధికార ప్రతినిధి తుమ్మ శోభన్ బాబు, మండల ప్రధాన కార్యదర్శి భూపతి ప్రవీణ్, కిసాన్ మోర్చా అధ్యక్షులు పెండ్యాల ప్రభాకర్ రెడ్డి, టౌన్ అధ్యక్షులు నాసాని రాజు, ఉపాధ్యక్షులు బండి సంపత్, కొలుగూరి రాజ్ కుమార్‌, నాయకులు నరిగే ఓదెలు, అట్ల చందర్ సింగ్, పిల్లి సతీష్, అంగారిక కార్తిక్ తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img