- భూపాలపల్లి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డిపై అధిష్టానం నజర్
- వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కదని ప్రచారం !
- భూదందాలు, సెటిల్మెంట్లు, వ్యక్తిగత వైఖరే కారణం..?
- ఎమ్మెల్సీ మధుసూదనాచారి బరిలోకి దిగుతారని వార్తలు
- ఉద్యమకారుడు, బీసీ నేతగా చారికి గుర్తింపు
- సీఎం కేసీఆర్ సన్నిహితుడిగా ప్రాధాన్యత
- రసవత్తరంగా మారుతున్న భూపాలపల్లి రాజకీయం
- ఆసక్తికరంగా మారుతున్న పరిణామాలు
భూపాలపల్లిలో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా అధికార బీఆర్ఎస్లో తాజాగా చోటుచేసుకుంటున్న పరిణామాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. భూపాలపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి టికెట్ విషయంలో అధిష్టా నం ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. నియోజకవర్గంలో పార్టీ బలంగా ఉన్నప్పటికీ, ఎమ్మెల్యే గండ్ర వైఖరి కారణంగా ప్రజల్లో బీఆర్ఎస్పై తీవ్ర వ్యతిరేకత పెరుగుతోందన్న భావనలో ఉన్నట్లు సమాచారం. ఇది ఇలాగే కొనసాగితే… రానున్న ఎన్నికల్లో పార్టీకి తీవ్ర నష్టం తప్పదన్న అంచనాకు వచ్చినట్లు తె లుస్తోంది. ఈక్రమంలోనే గండ్ర వెంకట రమణారెడ్డి మార్పు తప్పదనే ప్రచారం జోరుగా సాగుతోంది.
అదే సందర్భంలో ఉద్యమకారుడిగా, బీసీ నేతగా, సీఎం కేసీఆర్కు అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు ఉ న్న ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారికి టికెట్ ఇస్తే రాజకీయంగా ఎలా ఉంటుందనే యోచనలో కేసీఆర్ ఉన్నట్లు సమాచారం. కేసీఆర్కు అందిన సర్వే రిపోర్టులోనూ ఇదే విషయం ప్రస్పుటమైందని పార్టీ వర్గాల నుంచి గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ అంశం నియోజకవర్గంలో ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది.
పోటాపోటీ..
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో భూపాలపల్లి నియోజకవర్గానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక్కడి నుంచి గండ్ర వెంకట రమణారెడ్డి, సిరికొండ మధుసూదనాచారి, గండ్ర సత్యనారాయణరావు హోరాహోరీగా తలపడుతున్నారు. గత రెండు ఎన్నికల్లోనూ ముగ్గురు నువ్వా.. నేనా అన్నట్లుగా పోటీపడ్డారు. 2014 ఎన్నికల్లో అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి గండ్ర వెంకట రమణారెడ్డిపై టీఆర్ఎస్ అభ్యర్థిగా మధుసూదనాచారి 7214 ఓట్ల మెజార్టీతో విజయం సాధించి తెలంగాణ ప్రభుత్వంలో అత్యంత ప్ర తిష్టాత్మకమైన స్పీకర్ పదవిని అలంకరించారు. ఆ తర్వాత జరిగిన 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గండ్ర వెంకట రమణారెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. అప్పుడున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి బీఆర్ఎస్లో చేరారు.
గ్రూపులకు గండ్ర ఆజ్యం..
గండ్ర వెంకటరమణారెడ్డి చేరికకు ముందు వరకు ఉద్యమకారులు, పార్టీ నాయకులంతా ఏకతాటిపై ఉండగా … గండ్ర రాకతో బీఆర్ఎస్ రెండు గ్రూపులుగా చీలిపోయింది. ఉద్యమకారులు, తొలితరం బీఆర్ఎస్ నాయకులంతా చారి వైపు ఉండగా, కాంగ్రెస్ నుంచి వచ్చిన వారంతా గండ్ర వైపు నిలిచారు. నియోజకవర్గంలోని ప్రతి మండలంలో ఇదే పరిస్థితి ఇప్పటికీ ఉంది. ఈక్రమంలోనే ఉద్యమకారులను, బీఆర్ఎస్ శ్రేణులను ఎమ్మెల్యే గండ్ర కలుపుకుపోవడం లేదని అన్ని మండలాల్లోనూ బహిరంగంగానే విమర్శలు ఉన్నాయి. ఇదే ఇప్పుడు పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది. అంతేగాక… కాంగ్రెస్ నుంచి వచ్చిన వారికే పదవులు దక్కాయని, గండ్ర వెంకటరమణారెడ్డి ఒంటెద్దు పోకడతో పార్టీకి నష్టం కలుగుతోందని సొంత పార్టీ నేతలనుంచే అధిష్టానానికి ఫిర్యాదులు అందుతున్నాయి. ఇవేగాక.. భూకబ్జాలు, సెటిల్మెంట్లు, ఇసుక మాఫియాతోపాటు ఎమ్మెల్యే గండ్ర వర్గీయుల ఆగడాలు మితి మీరాయన్న ఆరోపణలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి.
కేసీఆర్ సర్వేలో ఏముంది..
ఎమ్మెల్యేల అభ్యర్థులను ఖరారు చేసేందుకు సీఎం కేసీఆర్ ఎంతగా దృష్టి సారిస్తాడనేది అందరికీ తె లిసిన విషయమే. సర్వేలో అనుకూల పరిస్థితులు లేకుంటే ఎంత పెద్ద నాయకుడైనా పక్కన పెట్టడం కేసీఆర్కు కొత్తేమీ కాదు. వచ్చే ఎన్నికల్లోనూ సర్వేల ఆధారంగానే టికెట్ల కేటాయింపు ఉంటుందని పలు సందర్భాల్లోనూ సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేలకు చెప్పారు. అందులో భాగంగానే ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. అయితే భూపాలపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి పరి స్థితి మాత్రం భిన్నంగా మారింది. భూపాలపల్లి ప్రజలు కాంగ్రెస్ అభ్యర్థిగా గండ్ర వెంకట రమణారెడ్డిని గెలిపించారు. ఇప్పటికి కాంగ్రెస్ నేతగానే అతడిని చూస్తున్నారు. వ్యక్తిగత స్వార్థం కోసం అధికార బీఆర్ ఎస్ పార్టీలో చేరాడన్న అపవాదు వందశాతం ఉంది. ఇదే గండ్ర అభ్యర్థిత్వం విషయంలో ప్రతికూలంగా మారే అవకాశాలు లేకపోలేదు. పార్టీలోనూ అందరినీ కలుపుకుపోయే విషయంలో గండ్ర వ్యవహారం సరిగా లేదని ఫిర్యాదులు గతంలోనే పార్టీ అధిష్టానానికి వెళ్లాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆ ర్ పర్యటన సందర్భంగా బహిరంగంగానూ ఇవి వ్యక్తమయ్యాయి. సీఎం కేసీఆర్ పలుమార్లు నిర్వహించిన సర్వేలోను గండ్రపై వ్యతిరేకత ఉందని తేటతెల్లమైనట్లు తెలుస్తోంది.
చారి బెటర్..!
ఎమ్మెల్సీ మధుసూదనాచారికి వివాద రహితుడిగా నియోజకవర్గంలో పేరు ఉంది. రాజకీయంగానూ సుదీర్ఘ అనుభవం ఉంది. 1994లోనే శాయంపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014 ఎన్నికల్లో భూపాలపల్లి నియోజకవర్గం నుంచి గెలుపొంది రాష్ట్ర తొలి స్పీకర్గా రికార్డు సృష్టించారు. తెలంగాణ కోసం కొట్లాడిన నేతగా నియోజకవర్గ ప్రజల్లో అభిమానం, ఆదరణ ఉంది. బీసీ నేతగానూ ఆ సామాజికవర్గాల్లో ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇటీవల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇంట్లో సమావేశమైన బీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల్లోనూ పార్టీ ప్రాధాన్యత ఇచ్చింది. దీంతో వచ్చే ఎన్నికల్లో బీసీ నేతలకు బీఆర్ఎస్ పార్టీ ప్రాధాన్యత ఇవ్వనుంది అనే సంకేతాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే భూపాలపల్లిలో చారిని పోటీకి నిలిపితే పార్టీ గెలుపు ఖాయమనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
ఉద్యమకారులకు గుర్తింపు
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో ఉద్యమకారులకు ఎక్కువ మొత్తంలో అసెంబ్లీ టికెట్లు ఇవ్వాలని పార్టీ అధిష్టానం నిర్ణయించినట్లు తెలుస్తోంది. బంగారు తెలంగాణ పేరుతో తొమ్మిదేళ్లుగా కాంగ్రెస్, టీడీపీ నుంచి నేతలను కేసీఆర్ బీఆర్ఎస్లో చేర్చుకున్నారు. మంత్రివర్గంలోనూ ఎక్కువ మొత్తంలో వారికి స్థానం కల్పించారు. దీంతో ఉద్యమకారుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. దీన్ని సరి చేయాలంటే వచ్చే ఎన్నికల్లో అధిక మొత్తంలో ఉద్యమకారులకు టికెట్లు ఇవ్వడమే సరైందని పార్టీ అధిష్టానం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అదే నిజమైతే భూపాలపల్లి నుంచి గండ్రని కాదని చారికి టికెట్ కేటాయించడం ఖాయంగా కనిపిస్తోంది. ఏదేమైనా సీఎం కేసీఆర్ మదిలో ఎవరున్నారో తేలాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.