- కాంగ్రెస్లోకి పరకాల వ్యవసాయ మార్కెట్ మాజీ చైర్మన్ పోలేపల్లి శ్రీనివాస్రెడ్డి
- కండువా కప్పి ఆహ్వానించిన గండ్ర సత్యనారాయణరావు
అక్షరశక్తి, శాయంపేట : భూపాలపల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి వరుస షాక్లు తగులుతున్నాయి. ఆ పార్టీని వీడి కాంగ్రెస్లో చేరుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. మొన్నటికి మొన్న భూపాలపల్లి మున్సిపాలిటీలో ఐదుగురు కౌన్సిలర్లు రాజీనామా చేసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే. తాజాగా, గురువారం పరకాల వ్యవసాయ మార్కెట్ మాజీ చైర్మన్ పోలేపల్లి శ్రీనివాస్రెడ్డి బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. శాయంపేటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శ్రీనివాస్రెడ్డికి కండువా కప్పి భూపాలపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి గండ్ర సత్యనారాయణ రావు ఆహ్వానించారు. శ్రీనివాస్ రెడ్డి వెంట సాధనపల్లి గ్రామ మాజీ సర్పంచ్ లావుడ్య వెంకటేశ్తోపాటు పలు గ్రామాలకు చెందిన మరో 200మంది బీఆర్ఎస్ మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కాంగ్రెస్లో చేరారు. ఈ సందర్భంగా శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ… పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి శూన్యమని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ మోసకారి పార్టీ అని భావించి, గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసిన గండ్ర వెంకటరమణ రెడ్డిని గెలిపిస్తే, బీఆర్ఎస్ పార్టీకి వెళ్లాడని ఆరోపించారు. గండ్ర వెంకటరమణారెడ్డి భూపాలపల్లి ఎమ్మెల్యేగా ఉండి శాయంపేట మండలంలోని గ్రామాలకు చేసిన అభివృద్ధి ఏమీ లేదని విమర్శించారు. ఎమ్మెల్యే తన ఆయిల్ ఫామ్ నుండి మొక్కలను భూపాలపల్లి నియోజకవర్గ రైతులకు అధిక ధరలకు ఇస్తూ, రైతులను నిండా ముంచుతున్నారని శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. భూపాలపల్లిలో గండ్ర సత్తన్నను అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని, అందుకు శక్తివంచన లేకుండా పనిచేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జీఎస్సార్ వెంట శాయంపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దూదిపాల బుచ్చిరెడ్డి, మండల మాజీ జెడ్పీటీసీ సభ్యుడు చల్ల చక్రపాణిలతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.