అక్షరశక్తి, వరంగల్ : వరంగల్లో వరుసగా ప్రజాప్రతినిధులు కరోనా వైరస్బారిన పడుతున్నారు. నిత్యం ప్రజల మధ్య ఉంటూ అనేక కార్యక్రమాల్లో పాల్గొంటున్న ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులను వైరస్ వెంటాడుతోంది. మొన్నటికి మొన్న జిల్లా మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు కరోనా వైరస్ బారిన పడి కోలుకున్నారు. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి వైరస్బారిన పడ్డారు. ఈ క్రమంలోనే భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, వరంగల్ జెడ్పీ చైర్ పర్సన్ గండ్ర జ్యోతికి కరోనా వైరస్ సోకింది. మంగళవారం టెస్టులు చేపించుకోగా కొవిడ్ బారిన పడినట్లు వారు తెలిపారు. ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్లో ఉన్నారు.
అలాగే.. మానుకోట ఎమ్మెల్యే శంకర్నాయక్ కూడా కొవిడ్బారిన పడ్డారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది. అయితే.. నియోజకవర్గంలో తమతో కలిసిన కార్యకర్తలు టెస్టులు చేయించుకోవలసిందిగా ఎమ్మెల్యేలు కోరారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇదిలా ఉండగా.. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గుండు సుధారాణి కొవిడ్ బారిన పడ్డారు. ప్రస్తుతం ఆమె హోమ్ ఐసోలేషన్లో ఉన్నారు. ఇక పార్టీ శ్రేణులు తమ నేతలు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.