- దేశంలో పెరుగుతున్న వైరస్ వ్యాప్తి
- కొత్తగా 2067 కేసులు, 40 మరణాలు..
కరోనా మహమ్మారి మళ్లీ భయపెడుతోంది. దేశంలో వైరస్ వ్యాప్తి క్రమంగా పెరుగుతోంది. భారత్లో ఫోర్త్ వేవ్ అనుమానాలను మరింత బలపరుస్తూ కొత్త కేసులు, మరణాలు భారీగా నమోదవుతున్నాయి. కేంద్ర ఆరోగ్యశాఖ బుధవారం వెల్లడించిన వివరాలు ఇదే విషయాన్ని సూచిస్తున్నాయి. రెండున్నరేళ్ల తర్వాత ఇప్పుడిప్పుడే మాస్కులు తీసేసి స్వేచ్ఛగా ఊపిరిపీల్చుకుంటోన్న ప్రజల్ని మళ్లీ మహమ్మారి భయాందోళనకు గురిచేస్తోంది.
కేంద్ర ఆరోగ్యశాఖ లెక్కల ప్రకారం, నిన్న (మంగళవారం) 4.21 లక్షల మందికి కొవిడ్ టెస్టులు నిర్వహించగా, కొత్తగా 2,067 మందికి వైరస్ సోకినట్లు తేలింది. సోమవారం ఒకేఒక్క కరోనా మరణం నమోదుకాగా.. నిన్నమాత్రం 40 మంది కొవిడ్తో చనిపోవడం గమనార్హం. ఇప్పటిదాకా కరోనా వల్ల 5.22 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. డబ్ల్యూహెచ్ఓ మాత్రం ఈ సంఖ్య 40 లక్షల వరకు ఉంటుందని అంచనా వేసింది.
కొత్త కేసులు మళ్లీ పెరుగుతుండటంతో కేంద్రం అప్రమత్తం అయింది. ఢిల్లీ, కేరళ, మహారాష్ట్ర, ఉత్తర్ప్రదేశ్, హర్యానా, మిజోరంలాంటి రాష్ట్రాలు కొవిడ్ కట్టడి విషయంలో అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరించింది. ఈనేపథ్యంలోనే ఆయా రాష్ట్రాలు తిరిగి మాస్క్ వాడకాన్ని తప్పనిసరి చేస్తున్నాయి.