- ప్రభుత్వ భూముల్లో ఎర్రజెండా..
- జక్కలొద్ది, బెస్తం చెరువుల్లో వెలిసిన పదివేల గుడిసెలు
- 60 ఎకరాలను చదును చేసిన 25 వేల మంది పేదలు
అక్షరశక్తి, వరంగల్ తూర్పు : ఖిలా వరంగల్ మండలంలోని జక్కలొద్ది, బెస్తం చెరువు ప్రభుత్వ భూముల్లో గుడిసెల జాతర షురూ అయ్యింది. ఈ రెండు ప్రాంతాల్లోని 60 ఎకరాల్లో ఇండ్లు లేని నిరుపేదలు 25 వేల మంది సుమారు పదివేల గుడిసెలను ఒక్క పూటలోనే నిర్మించారు. సీపీఎం రంగశాయిపేట ఏరియా కమిటీ పిలుపు మేరకు బుధవారం తెల్లవారుజామున మూడు గంటల నుంచి ఈ భూముల్లోకి పేదలు చేరుకున్నారు. పిల్లాపాపలతో సహా తలదాచుకునేందుకు జాగా కోసం సద్దిమూటతో వచ్చారు. కొంతమందైతే వంట సామాగ్రి తెచ్చుకొని అక్కడే వంట చేశారు. గతంలోనూ ఇక్కడ గుడిసెలు వేయగా, పోలీసులు వాటిని కాల్చివేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పోలీసులు, రెవెన్యూ అధికారుల సూచన మేరకు సీపీఎం ఆధ్వర్యంలో జాబితాను సేకరించి తహసీల్దార్కు అందజేశారు.
ఇందులో భాగంగా మే 18వ తేదీ ఉదయం మూడు గంటల నుంచే పేదలు గుడిసెల నిర్మాణాన్ని ప్రారంభించారు. విషయం తెలుసుకున్న స్థానిక సీఐ, తహసీల్దార్ గుడిసెల వద్దకు వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోవాలని ఆదేశించారు. గతంలో మీరు చెప్పినట్లే మేం చేశాం. దరఖాస్తులు ఇచ్చాం. మీ నుంచి ఎలాంటి స్పందన లేదు. ఇప్పుడు మా పని మేం చేస్తున్నాం. మీరు బెదిరిస్తే మేము భయపడేది లేదు అని ప్రజలు భీష్మించారు. సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు జగదీష్, రంగశాయిపేట ఏరియా కార్యదర్శి సాగర్ గుడిసెల ప్రాంతాన్ని సందర్శించి ప్రజలతో మాట్లాడారు. ధైర్యంగా ఉండాలని చెప్పారు. జక్కలొద్దిలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు. ఇరవై ఏళ్ల క్రితం మే 18వ తేదీన గుడిసెల పోరాటంలో అమరుడైన రామ సురేందర్ స్ఫూర్తితో పోరాటంలోకి దిగాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఓదేలు, ప్రశాంత్, నాగలక్ష్మి, మీరునిషా రమేష్, శ్రీనివాస్, మాధవి, చందు, లావణ్య తదితరులు పాల్గొన్నారు.