Sunday, September 8, 2024

వ‌రంగ‌ల్‌లో శంక‌ర్‌దాదా ఎంబీబీఎస్‌

Must Read
  • ఎలాంటి విద్యార్హత‌లు లేకుండా డాక్ట‌ర్‌గా..
  • చింత‌ల్‌ప్రాంతంలో హెల్త్ కేర్ ఫార్మసీ హాస్ప‌ట‌ల్ నిర్వ‌హ‌ణ‌
  • నాలుగేళ్లుగా సుమారు 43వేల మందికి ప‌రీక్ష‌లు
  • ప‌క్కా స‌మాచారంలో ప‌ట్టుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు
  • నిందితుల నుంచి న‌గ‌దు, ల్యాప్‌టాప్ స్వాధీనం
  • వివ‌రాలు వెల్ల‌డించిన వ‌రంగ‌ల్‌ సీపీ డాక్ట‌ర్ త‌రుణ్‌జోషి

అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ క్రైం : వరంగల్ నగరంలో ఎలాంటి విద్యార్హత లేకుండానే వైద్యం చేస్తున్న నకిలీ డాక్టర్‌తోపాటు అతని స‌హాయ‌కుడిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. నకిలీ డాక్టర్ నుండి ఒక లక్ష 90 వేల రూపాయల నగదుతో పాటు, ఒక ల్యాప్ ట్యాప్, మూడు సెల్‌ఫోన్లు, ల్యాబ్ పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో వరంగల్ నగరానికి చెందిన ముజతాబా ఆహ్మద్, మరో నిందితుడు దామెరకొండ సంతోష కుమార్ ఉన్నారు. వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్ట‌ర్ తరుణ్ జోషి వివరాలను వెల్లడించారు. నిందితుల్లో ఒకడైన ముజతాబా ఆహ్మద్ బి.ఫార్మసీ మధ్యలో ఆపేసి స్థానికంగా వున్న డాక్టర్ వద్ద స‌హాయ‌కుడిగా కొన్ని సంవత్సరాలు పనిచేశాడు. ఈ ప‌నితో వ‌చ్చే డ‌బ్బులు సరిపోకపోవడంతో మరింత డబ్బును సంపాదించాలనుకున్నాడు. ఇందుకోసం ప్రధాన నిందితుడు శంక‌ర్‌దాదా ఎంబీబీఎస్‌గా అవతారమెత్తాడు. నకిలీ ఎయిమ్స్ వైద్య విభాగ సర్టిఫికెట్ తయారు చేసుకుని, మరో నిందితుడు ల్యాబ్ టెక్నీషియ‌న్‌ సంతోష్ కుమార్‌తో క‌లిశాడు.

వరంగల్ నగరంలో చింతల్ ప్రాంతంలో హెల్త్ కేర్ ఫార్మసీ పేరుతో 2018 సంవత్సరంలో హాస్పిట‌ల్ ప్రారంభించి ఎంబీబీఎస్ డాక్టర్‌గా ప్రజలకు వైద్యం అందించడంతో పాటు, తన ల్యాబ్లో వైద్య పరీక్షలు నిర్వహించి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసేవాడు. అదే విధంగా తన ల్యాబ్ లో చేసిన వైద్య పరీక్షలను అసరగా చేసుకుని నిందితుడు చికిత్స కోసం వచ్చిన రోగులను రోగం పేరుతో భయభ్రాంతులను చేసి వారిని నగరంలోని ఇతర హాస్ప‌ట‌ల్స్‌కు పంపించేవాడు. సదరు హాస్పటల్ యాజమాన్యం నుండి పెద్ద
మొత్తంలో కమీషన్లు స్వీకరించేవాడు. గత నాలుగేళ్లుగా నిందితుడు సుమారు 43వేల మంది రోగులను పరీక్షించాడు. ఈ నకిలీ డాక్టర్ వ్యవ‌హారానికి సంబంధించి టాస్క్ ఫోర్స్ పోలీసులకు సమాచారం అందడంతో టాస్క్‌ఫోర్స్ ఇన్‌చార్జి అదనపు డీసీసీ వైభవ్ గైక్వాడ్ ఆదేశాల మేరకు నకిలీ డాక్టర్ హాస్పటల్ తనిఖీ నిర్వహించడంతో ఈ వ్యవహారం బయటపడటంతో నిందితులను పోలీసులు అరెస్ట్ మీల్స్ కాలనీ పోలీస్ స్టేషను తరలించారు. ఈ నకిలీ డాక్టర్ బాగోతాన్ని గుట్టురట్టు చేసిన టాస్క్ ఫోర్స్ ఇన్ స్పెక్టర్లు నరేష్ కుమార్, వెంకటేశ్వర్లు, ఎస్సైలు లవణ్ కుమార్, అనిల్, హెడ్ కానిస్టేబుళ్లు శ్యాంసుందర్, సోమలింగం, అశోక్, మాధవరెడ్డి, స్వర్ణలత, కానిస్టేబుళ్లు శ్రవణ్ కుమార్, సృజన్, రాజేష్, నవీన్, ఆలీ, శ్రీను, నాగరాజు, సురేష్, రాజు, భిక్షపతి, శ్యామ్, శ్రీధర్‌ను పోలీస్ కమిషనర్ కమిషనర్ అభినందించారు.

 

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img