- ప్రకటించిన మావోయిస్టు పార్టీ
- బీజాపూర్ ఎన్కౌంటర్పై లేఖ విడుదల
మావోయిస్టు అగ్రనేత మడావి హిడ్మా అలియాస్ సంతోష్ చనిపోలేదని మావోయిస్టు పార్టీ ప్రకటించింది. ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో జరిగిన కాల్పులపై ఆ పార్టీ లేఖ విడుదల చేసింది. కాల్పుల్లో హిడ్మా చనిపోయి నట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని స్పష్టం చేసింది. దక్షిణ భాస్కర్ అటవీ ప్రాంతంలోని కొండలపై పోలీసులు, సీఆర్పీఎఫ్ బలగాలు హెలికాప్టర్లతో దాడులు చేశారు. గత ఏడాది ఏప్రిల్ లోనూ వైమానిక బాంబు దాడి జరిగింది. మావోయిస్టు పార్టీ నాయకత్వం, పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీని దెబ్బతీయాలని వందల సంఖ్యలో బాంబులు పేల్చారు. రాత్రి, పగలు తేడా లేకుండా హెలికాప్టర్ ద్వారా నిఘా పెట్టారు. వచ్చే ఎన్నికల్లోపు మావోయిస్టులను ఏరిపారేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్షా ప్రకటించారు. అందు లో భాగంగానే మాపై దాడులు జరుగుతున్నాయి. ఈ భీకర దాడుల కారణంగా ప్రజలు పొలాలకు వెళ్లలేకపోతున్నారు. దేశంలోని పాలకవర్గాలకు వ్యతిరేకంగా ప్రపంచంలోని అన్ని ప్రగతిశీల, ప్రజాస్వామ్య కూటములు ఏకం కావాలి. అని మావోయిస్టులు లేఖలో పేర్కొన్నారు. హిడ్మా కోసం కొంతకాలంగా ఛత్తీస్గఢ్ పోలీసులతోపాటు సీఆర్పీఎఫ్, కోబ్రా బలగాలు, తెలంగాణ గ్రేహౌండ్స్ బలగాలు విస్తృతంగా కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. నాలుగు నెలల కిందట సైతం భద్రతా బలగాల ఆపరేషన్ నుంచి హిడ్మా తప్పించుకున్నాడు. ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఒడిషా సరిహద్దుల్లో అనుచరులతో మకాం వేసినట్లు బలగాలకు సమాచారం అందింది. దీంతో బీజాపూర్-సుఖ్మా సరిహద్దుల్లో కూంబింగ్ నిర్వహించారు. ఈసమయంలోనే ఎదురుకాల్పులు జరిగాయని, కాల్పుల్లో హిడ్మా మృతి చెందాడని పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. కానీ దీనిపై బుధశారం రాత్రి వరకు ఎలాంటి స్పష్టత రాలేదు. ఈ నేపథ్యంలోనే మావోయిస్టు లేఖ విడుదల చేసింది.