Saturday, September 7, 2024

సకల వివక్షలకు వ్యతిరేకంగా పోరాడటమే నాస్తికత్వం

Must Read

– సాంస్కృతిక విప్లవమే అన్ని విప్లవాలకు పునాది
– ద్రవిడ కళగం నేత కుమరేసన్
– హ‌న్మ‌కొండ‌లో భా.నా.స 3వ రాష్ట్ర మహాసభలు
– పాల్గొన్న ప్రొఫెసర్ కాశీం, డాక్టర్ జిలకర శ్రీనివాస్, గడ్డం లక్షన్, గురిజాల రవీందర్

అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ : శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎంతో అభివృద్ధి చెందినప్పటికీ నేటికీ కొనసాగుతున్న సకల అసమానతల నిర్మూలన కోసం పోరాటం చేసి ప్రజల మధ్యనున్న అసమానతల తొలగింపు కోసం నిరంతరం అధ్యయనం చేసి పోరాటం చేయడమే నాస్తికత్వమని ద్రవిడ కళగం నేత కుమరేసన్ అన్నారు. బుధవారం హన్మకొండ జిల్లా కేంద్రం వడ్డేపల్లిలోని పల్లా రాజేశ్వర్ రెడ్డి భవన్ లో భా.నా.స జాతీయ కమిటీ సభ్యుడు జె రవి, ఉప్పులేటి నరేష్ ల అధ్యక్షతన జరిగిన భారత నాస్తిక సమాజం తెలంగాణ రాష్ట్ర 3వ మహాసభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.
భారతదేశంలో సామాజిక విప్లవాలకు, రాజ్యాంగ సవరణలకు కారణమైన పెరియార్ ఉద్యమ భావజాలాన్ని 1970 నుండే ప్రచారం చేసి ప్రజలను చైతన్య చేయడంలో తన జీవితాన్నే త్యాగం చేసిన భారత నాస్తిక సమాజం వ్యవస్థాపకులు డాక్టర్ జయగోపాల్ చాలా గొప్పవారని, ఆయన ఆశయాలను, పెరియార్ ఆశయాలను కొనసాగించి ప్రజల్లోనున్న అసమానతలను తొలగించే పోరాటంలో తెలంగాణలో పోరాటం చేస్తున్న భా.నా.స నాయకులందరికీ ధన్యవాదాలు తెలిపారు. పెరియార్ స్థాపించిన ద్రవిడ కళగం, తెలంగాణలోని భా.నా.స రెండూ ఒకే భావజాలంతో పనిచేసే సంస్థలని, విద్యార్థి దశలోనే మూఢనమ్మకాల నిర్మూలన చేసే లక్ష్యంగా సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేష్ ఏర్పాటు చేసిన దేశంలోనే ఏకైక సంస్థ భా.నా.స అని ఆయన అన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని అసమానతలు భారతదేశంలో ఉన్నాయని, మనిషి పుట్టుకతోనే భారతదేశంలో వివక్ష మొదలవుతుందని, అంటరానితనం, పేదరికంతో ప్రజలు పుడుతున్నారని, కుక్కలు, పందులు తిరిగే బజారులో మనుషులు తిరగరాధనే నిబంధనను పెట్టీ వేల సంవత్సరాలు అణచివేసిన దేశ పాలకులు నేటికీ ఎన్నో అసమానతలను కొనసాగిస్తూ ప్రజలను నిత్యం దోపిడీ చేస్తున్నారని అన్నారు. పీడిత ప్రజలు దోపిడీని ప్రశ్నించకుండా ఉండడానికి ప్రజలను దేవుడు, మూఢవిశ్వాసాల వైపు నెడుతున్నారని ఆయన అన్నారు. నాస్తిక నాయకులు ప్రజలను చైతన్యం చేసి దేశంలోని అజ్ఞానాన్ని, అసమానతలను తొలగించడంలో కీలకపాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న వి.సి.కె పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ జిలుకర శ్రీనివాస్, పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు గడ్డం లక్ష్మణ్, ప్రొఫెసర్ ఖాసీం, రచయిత గురిజాల రవీందర్, భా.న.స జాతీయ కమిటీ సభ్యులు సాయిని నరేందర్, జె రవి మాట్లాడుతూ మూడవ సారి అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ ప్రభుత్వ దేశంలోని రాజ్యాంగాన్ని మార్చి రామరాజ్యం పేరుతో మనుధర్మ పాలనను తీసుకొచ్చే ప్రమాదముందని, ప్రగతిశీల శక్తులు, నాస్తికులు, హేతువాదులు ఐక్య ఉద్యమాలు చేసి మానవీయ విలువల సమాజ నిర్మాణం కోసం కృషి చేయాలని, మతోన్మాద రాజకీయాలను వ్యతిరేకించి సమసమాజ స్థాపన కోసం, సామాజికన్యాయమ కోసం కృషి చేయాలని అన్నారు. ప్రతి ఇంటా శాస్త్రీయ బావాలను పెంపొందించి శాస్త్రీయ సమాజ నిర్మాణం కోసం కృషి చేయాలని, మూఢనమ్మకాల నిర్మూలన చట్టం కోసం అందరూ కలిసి పోరాటం చేయాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో వి.సి.కె పార్టీ కార్యనిర్వహక అధ్యక్షులు మచ్చ దేవేందర్, భారత్ బచావో జిల్లా అధ్యక్షులు వెంగల్ రెడ్డి, బా.నా.స నాయకులు జ్యోతికుమార్, చార్వాక, శ్యామల, రామంచ భరత్, గుమ్మడిరాజుల సాంబయ్య, పెండ్యాల సుమన్, వేదాంత మౌర్య, సంతోష్, స్వప్న, అశోక్, గుత్తికొండ చక్రాధర్, రాధండి దేవేందర్, సునీత విద్యార్థి నాయకులు ఆజాద్, శ్రావణ్, న్యాయవాదులు ఎగ్గడి సుందర్ రామ్, పాణి రంజిత్ గౌడ్, వివిధ సంఘాల నాయకులు సోమ రామమూర్తి, దూడల సాంబయ్య, కొంగ వీరాస్వామి, కుమారస్వామి, పటేల్ వనజ, చాపర్తి కుమార్ గాడ్గే, సింగారపు అరుణ, బుంగ జ్యోతి, సద్గుణ, చెన్న నీలిమ, పల్లె ప్రశాంత్, ఐతం నగేష్, దొమ్మాట ప్రవీణ్ కుమార్, నున్న అప్పారావు, బైరాగి, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img