- మొత్తం పరీక్షా కేంద్రాలు 1,443
- పరీక్షలకు హాజరుకానున్న విద్యార్థుల సంఖ్య 9.07 లక్షలు
- నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
అక్షరశక్తి, హైదరాబాద్ : తెలంగాణలో ఇంటర్ పరీక్షల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈనెల 6 నుంచి 19వ తేదీ వరకు రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. శుక్రవారం నుంచి ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్, ఎల్లుండి శనివారం నుంచి సెకండియర్ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ఇందుకోసం మొత్తం 1,443 కేంద్రాలను ఏర్పాటు చేసింది ఇంటర్ బోర్డ్. మొత్తం 9.07 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. కరోనా కారణంగా రెండేళ్లుగా రాష్ట్రంలో ఇంటర్ ఎగ్జామ్స్ ను నిర్వహించలేదు. ఈ నేపథ్యంలో ఈసారి సిలబస్ను 70 శాతానికి కుదించారు అధికారులు. ఇంటర్ ఎగ్జామ్స్ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించనున్నారు. అయితే.. నిమిషం ఆలస్యమైనా ఎగ్జామ్ సెంటర్లలోకి అనుమతించేది లేదని ఇంటర్ బోర్డు ఇప్పటికే స్పష్టం చేసింది. ఇంటర్ పరీక్షల సందర్భంగా ఇంటర్ బోర్డ్ విద్యార్థులకు పలు సూచనలు చేసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
1. విద్యార్థులను ఎగ్జామ్ సెంటర్లలోకి 8.30 నుంచే అనుమతిస్తారు. 8.45 లోపే కేంద్రాల్లోని తమ సీట్లలో కూర్చునేలా ప్లాన్ చేసుకోవాలి.
2. కాలేజీల నుంచి హాల్ టికెట్ను ఇప్పటివరకు పొందని విద్యార్థులు ఇంటర్ బోర్డు వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవాలి.
3.హాల్ టికెట్పై ఏమైనా తప్పులు ఉంటే వెంటనే సంబంధింత కాలేజీ ప్రిన్సిపాల్ దృష్టికి విషయాన్ని తీసుకుపోవాలి.
4.ఆన్సర్ షీట్ ఇవ్వగానే దానిపై ఉన్న నిబంధనలను జాగ్రత్తగా చదువుకోవాల్సి ఉంటుంది. హాల్ టికెట్ పై ఉన్న రిజిస్టర్డ్ నంబర్, ఓఎంఆర్ షీట్ పై ఉన్న రిజిస్టర్డ్ నంబర్ ఒకటేనా ? కాదా ? అన్నది విద్యార్థులు సరి చూసుకోవాలి. లేకపోతే ఫలితాల్లో తప్పులు వచ్చే అవకాశం ఉంటుందని బోర్డు హెచ్చరించింది.
5.పరీక్షా కేంద్రానికి వెళ్లే సమయంలో విద్యార్థులు తప్పనిసరిగా హాల్ టికెట్ను వెంట తీసుకురావాల్సి ఉంటుంది. తనిఖీకి వచ్చిన అధికారులకు హాల్ టికెట్ ను చూపించాల్సి ఉంటుంది.
6.విద్యార్థులు ఆన్సర్ బుక్ పై పేరు, రిజిస్ట్రేషన్ నంబర్ లాంటి వివరాలను అస్సలు రాయవద్దని బోర్డు సూచించింది.