- అభివృద్ధి పేర అధికారుల అనాలోచిత నిర్ణయాలు
- పాఠశాల క్రీడా మైదానంలో హెలిప్యాడ్ నిర్మాణం
- నిరుపయోగంగా అదనపు గదులు
- మళ్లీ నూతన గది కోసం పనులు
అక్షరశక్తి, భీమదేవరపల్లి : అధికారుల అనాలోచిత నిర్ణయాలతో పాఠశాల క్రీడా మైదానం కనుమరగయ్యే ప్రమాదం ఏర్పడింది. మండలంలోని ముల్కనూర్ ప్రభుత్వ బాలుర పాఠశాల మైదానంపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి.
వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని ముల్కనూర్ ప్రభుత్వ పాఠశాల క్రీడా మైదానంలో అదనపు తరగతి గదుల నిర్మాణం చేపడుతున్నారు. గతంలో దివంగత వైఎస్ రాజశేఖర్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ముల్కనూరు సందర్శించారు. కాగా పాఠశాల మైదానంలోనే హెలీప్యాడ్ ఏర్పాటుచేశారు. తర్వాత తొలగించకపోవడంతో విద్యార్థులు ఆడుకునేందుకు ఇబ్బందులు ఎదురవతున్నాయి.
ఇటీవల అదనపు తరగతుల కోసం, అంగన్వాడీ భవనం కోసం, వంటశాల కోసం ఆట స్థలాన్నే ఉపయోగించుకుంటున్నారు. క్రీడా మైదానంలో కేవలం స్టోర్ రూమ్ మాత్రమే ఉండాల్సి ఉండగా, నిబంధనలకు విరుద్ధంగా క్రీడా మైదానంలోనే హెలీ ప్యాడ్, వాటర్ ట్యాంక్ నిర్మాణం చేపట్టడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా శిథిలావస్థలో ఉన్న భవనాలను మరమ్మతు చేసి, ఆ గదులను వినియోగించుకోవాలని, పాఠశాల మైదానాన్ని ఆక్రమించకుండా తగిన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
అదనపు గదుల నిర్మాణం వల్ల క్రీడా మైదానం విస్తీర్ణం తగ్గుతుందని ఉన్నతాధికారులు ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలని కోరుతున్నారు. హెలిప్యాడ్ నిర్మాణం వెంటనే తొలగించాలని, నూతనంగా చేపడుతున్న గది నిర్మాణ పనులు ఆపేసి మరొక చోట కట్టుకోవాలని కోరుతున్నారు.