- రంగంలోకి కొండా మురళి !
- పాలకుర్తి నుంచి బరిలోకి..
- మంత్రి దయాకర్రావుపై మురళీధర్రావు పోటీ..?
- జూన్ 10న నియోజకవర్గ కేంద్రంలో భారీ బహిరంగ సభ..?
- హాజరుకానున్న పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి
- ఓరుగల్లులో మారుతున్న రాజకీయ సమీకరణాలు
- రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్..!
అక్షరశక్తి, ప్రధానప్రతినిధి: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యగా కాంగ్రెస్ పార్టీ భారీ స్కెచ్ వేస్తోందా..? అధికార టీఆర్ఎస్ పార్టీని ధీటుగా ఎదుర్కొనేందుకు వ్యూహాత్మకంగా ముందుకు కదులుతుందా ..? ఇందులో భాగంగా అభ్యర్థుల ఎంపికలో, నియోజకవర్గాల కేటాయింపులో అనూహ్య మార్పులకు శ్రీకారం చుడుతోందా..? అంటే ఓరుగల్లు కాంగ్రెస్ పార్టీలో కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలు ఔననే అంటున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పార్టీకి పూర్వవైభవం తేవడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇందులో భాగంగా అభ్యర్థుల ఎంపిక, నియోజకవర్గాల కేటాయింపులో అనూహ్య మార్పులు తప్పనట్లే కనిపిస్తోంది. ప్రధానంగా ఓరుగల్లు రాజకీయాల్లో సీనియర్ నేతలుగా, సుదీర్ఘ ప్రత్యర్థులుగా ఉన్న కొండా మురళీధర్రావు, ఎర్రబెల్లి దయాకర్రావుపై పోటీకి దిగుతున్నారని విశ్వసనీయ సమాచారం. మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ప్రాతినిధ్యం వహిస్తున్న పాలకుర్తి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా కొండా మురళి పోటీ చేస్తారన్న వార్త రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది.
ఎందుకీ అనూహ్య మార్పులు
పాలకుర్తి నియోజకవర్గంలో బీసీ సామాజికవర్గం ఓట్లు అధికంగా ఉన్నాయి. మొత్తం ఓట్లలో సుమారు 70 శాతానికిపైగా బీసీల ఓట్లు ఉండటం గమనార్హం. కొంతకాలంగా బహుజన కాన్సెప్ట్ బలపడుతున్న నేపథ్యంలో ఈ నియోజకవర్గ బీసీ వర్గాలు తమ నియోజకవర్గ నేత కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా మాజీ ఎమ్మెల్సీ, కాంగ్రెస్ నేత కొండా మురళిని ఈ వర్గాలు పాలకుర్తి నుంచి పోటీ చేయాలని, తాము గెలిపించుకుంటామని చెబుతున్నట్లు సమాచారం. అంతేగాకుండా కాంగ్రెస్ చేపట్టిన అంతర్గత సర్వేలోనూ ఇదే విషయం ప్రధానంగా తేలినట్లు తెలుస్తోంది. ఎర్రబెల్లిని ధీటుగా ఎదుర్కోడానికి కొండా మురళిలాంటి బలమైన నేత అయితేనే సాధ్యం అవుతుందన్న అంచనాకు పార్టీ వచ్చినట్లు సమాచారం. ఈనేపథ్యంలోనే పాలకుర్తి నియోజకవర్గం నుంచి కొండా మురళిని బరిలోకి దింపాలనే నిర్ణయానికి కాంగ్రెస్ అధిష్టానం వచ్చినట్లు కీలక నేతల నుంచి విశ్వసనీయ సమాచారం అందింది.
జూన్ 10న పాలకుర్తిలో బహిరంగ సభ..?
ఈ నేపథ్యంలోనే పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ సభకు పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్లు తెలుస్తోంది. భారీగా జన సమీకరణ జరపాలని కూడా హైకమాండ్ నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సభ నుంచే పాలకుర్తి కాంగ్రెస్ అభ్యర్థిగా కొండా మురళి పేరును రేవంత్ ప్రకటించే అవకాశం ఉంది.