అక్షరశక్తి భూపాలపల్లి: భూపాలపల్లి నియోజకవర్గంలో గత నాలుగైదు రోజుల నుండి ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో పొంగి ప్రవహిస్తున్న వాగులపై ఎప్పటికప్పుడు అన్ని శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు అప్రమత్తంగా ఉండాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు సూచించారు.ఆదివారం సాయంత్రం జిల్లా అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, ప్రజాప్రతినిధులతో కలిసి మొరంచపల్లి వాగు ఉధృతి తో పాటు పరిసరాలను పరిశీలించారు. అనంతరం మీడియాతో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయని అన్నారు. వరద ఉదృతి గల వాగుల పరివాహక ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, ఎవరికీ ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రత్యేకంగా వాగులపై రోడ్లు, కల్వర్టులు, బ్రిడ్జిల వద్ద అప్రమత్తంగా ఉండాలని, ప్రజలను అన్ని విధాలుగా అప్రమత్తం చేయాలన్నారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకి వెళ్లోద్దని విజ్ఙప్తి చేశారు.గతేడాది ఇదే నెలలో మోరంచపల్లి గ్రామంలో వరదలు సంభవించి పెద్ద ఎత్తున ఆస్తి నష్టం, ప్రాణనష్టం జరిగిందని, అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. వరద ఉదృతిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ప్రజలను అప్రమత్తం చేయాలని, ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా కాపాడుకోవాల్సిన భాద్యత మనపై ఉందని స్పష్టం చేశారు. మోరంచవాగు మొదటి ప్రమాద హెచ్చరిక దాటి ప్రవహిస్తుందని వరద ప్రభావం ఇలాగే కొనసాగితే లోతట్టు ప్రాంతాలు ముంపుకు గురయ్యే అవకాశం ఉందని, ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. గణపసముద్రం చెరువు నీటిమట్టం రోజు రోజుకు పెరుగుతూ ఉందని నీటిమట్టం పెరిగితే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులు అప్రమత్తతో ఉండాలని ఆదేశించారు. గణపసముద్రం చెరువు ద్వారా సాగవుతున్న ఆయకట్టు రైతులను అప్రమత్తం చేయాలని సూచించారు.
గంటకు గంటకు వాగు ఉధృతి పెరుగుతుంది.. పంచాయతీ కార్యదర్శి, ఇరిగేషన్ అధికారులు అలెర్ట్ గా ఉండాలి– అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు
మొరంచవాగు వరద ఉధృతి ప్రతీ గంటకు గంటకు పెరుగుతుందని, స్థానిక పంచాయతీ కార్యదర్శి, ఇరిగేషన్ అధికారులు మరింత అలర్ట్ గా ఉండాలని జిల్లా అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు సూచనలు చేశారు. మొరంచవాగు మూడవ ప్రమాద హెచ్చరికకు చేరుకునే సమయానికి గ్రామంలోని ప్రజలందరినీ పునరావాస కేంద్రాలకు తరలించాలని సూచించారు.
గ్రామంలో గతంలో వచ్చిన వరదలతో చాలా ఆస్తి, ప్రాణస్టం సంభవించిందని అలాంటి ఘటనలు తిరిగి పునరావృతం కాకుండా చూడాలని కోరారు.
ఈ కార్యక్రమంలో భూపాలపల్లి ఆర్డీవో మంగీలాల్ ,ఇరిగేషన్ ఈఈ వెంకటేశ్వర్లు,ఇరిగేషన్ డిఈ ప్రసాద్, ఎమ్మార్వో శ్రీనివాస్ ,ఎంపిడివో యం.డి ఇక్బాల్, SI ప్రసాద్ మరియు కాంగ్రెస్ నాయకులు చల్లూరి మధు,బుర్ర కొమురయ్య,కురిమిళ్ళ శ్రీనివాస్,డాన్స్ రాజేష్,అప్పం కిషన్,పొనగంటి శ్రీనివాస్,అధికారులు తదితరులు పాల్గొన్నారు.