అక్షరశక్తి డెస్క్: తెలంగాణ వారైనప్పటికీ కవీంద్రుడు స్వర్గీయ డాక్టర్ సి.నారాయణరెడ్డి యావత్ తెలుగు జాతికి గర్వకారణంగా నిలుస్తారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తెలుగు సాహితీ లోకానికి సినారె చేసిన సేవలు కలకాలం గుర్తుండిపోయేలా ఒక విద్యా సంస్థకు అయన పేరు పెడతామని, కాంస్య విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తామని సీఎం ప్రకటించారు. డాక్టర్ సి.నారాయణ రెడ్డి 93వ జయంతి సందర్భంగా సోమవారం హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగిన పురస్కార ప్రదానోత్సవంలో సీఎం పాల్గొన్నారు. శ్రీమతి సుశీల నారాయణరెడ్డి ట్రస్టు, సినారె గారి పేరు మీద నెలకొల్పిన “విశ్వంభర డాక్టర్ సి.నారాయణరెడ్డి జాతీయ సాహిత్య పురస్కారాన్ని” ప్రముఖ తమిళ రచయిత్రి శివశంకరి కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రదానం చేశారు. ఈ సందర్భంగా సినారె రచించిన “సమన్వితం” పుస్తకాన్ని కూడా సీఎం ఆవిష్కరించారు.
కార్యక్రమంలో ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, శాంతా బయోటెక్ వ్యవస్థాపకులు పద్మభూషణ్ వరప్రసాద్ రెడ్డి, మాజీ ఎంపీ మురళీ మోహన్, సినారె యొక్క కుటుంబీకులు, పలువురు సాహితీవేత్తలు, సినారె అభిమానులు పాల్గొన్నారు.