- నవంబర్ 24 తహసీల్దార్ కార్యాలయాలు
- 30న నియోజకవర్గ కేంద్రాల్లో…
- డిసెంబర్ 5న జిల్లా కలెక్టరేట్ల వద్ద ఆందోళనలు
- ప్రకటించిన టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి
అక్షరశక్తి, ప్రధానప్రతినిధి : టీఆర్ఎస్ ప్రభుత్వంపై తెలంగాణ కాంగ్రెస్ పోరుబాట పట్టింది. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా కార్యాచరణ ప్రకటించింది. ప్రధానంగా రైతు సమస్య ఎజెండాగా హైదరాబాద్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ను టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క, మాజీ మంత్రి బలరాంనాయక్, టీపీసీసీ బృందం కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం మీడియాతో రేవంత్రెడ్డి మాట్లాడుతూ… భూమి, వ్యవసాయం, రైతుల సమస్యలపై వినతిపత్రం అందజేశామని తెలిపారు. తక్షణమే ప్రభుత్వం స్పందించకపోతే నవంబర్ 24న రాష్ట్ర వ్యాప్తంగా మండల కేంద్రాల్లోని రెవెన్యూ కార్యాలయాల వద్ద నిరసన తెలుపుతామని, నవంబర్ 30న ధరణి బాధితులతో నియోజకవర్గాల్లో నిరసన చేపడతామని,అదేవిధంగా డిసెంబర్ 5న జిల్లా కేంద్రాల్లో కలెక్టరేట్ల వద్ద ధర్నా చేపడతామని ప్రకటించారు. అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి ఈ సమస్యలకు పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు.
కూర్చోవడానికి సచివాలయం లేదు.. కలవడానికి సీఎం లేడు.. అంటూ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. వివిధ సామాజిక వర్గాల సమస్యలపై కొట్లాడుతున్న సంఘాలకు ఎనిమిదేళ్లుగా సీఎం దర్శనం కలగలేదని అన్నారు. సీఎం ప్రజలకు అందుబాటులో ఉండాలని, సమస్యలపై దృష్టి సారించాలని అన్నారు. సీఎం ప్రజల ఆస్తుల వివరాలను ప్రయివేటు కంపెనీలకు ధారాదత్తం చేశారని,
వ్యక్తుల ఆస్తుల వివరాల సమాచారం రహస్యంగా ఉంచాలగానీ ప్రయివేటు వ్యక్తులు, కంపెనీల చేతుల్లోకి వెళ్లి దుర్వినియోగం అవుతోందని ఆరోపించారు. వారిపై చర్యలు తీసుకోవాలని సీఎస్కు వివరించామని,
భూములు ఉన్న ప్రతి ఒక్కరు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని అన్నారు. 24లక్షల ఎకరాల భూముల వివరాలు ధరణిలో కనిపించడం లేదని, తక్షణమే భూ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ధరణితో రాష్ట్ర ప్రభుత్వం రైతుల పొట్ట కొడుతోందని, ప్రభుత్వం తక్షణమే రైతు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. పోడు భూముల పట్టాలు ఇవ్వకుండా కమిటీలతో ప్రభుత్వం కాలయాపన చేస్తోందని ఆరోపించారు.
అటవీ హక్కుల చట్టం ప్రకారం పోడు భూములకు పట్టాలివ్వాలని తక్షణమే ప్రభుత్వం స్పందించకపోతే ఈ నెల 24న మండల కేంద్రాల్లో రెవెన్యూ కార్యాలయాల వద్ద నిరసన తెలుపుతామని, ఈ నెల 30న ధరణి బాధితులతో నియోజకవర్గాల్లో నిరసన చేపడతామని, డిసెంబర్ 5న జిల్లా కేంద్రాల్లో కలెక్టరేట్ల వద్ద ధర్నా చేపడతామని హెచ్చరించారు. అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి ఈ సమస్యలకు పరిష్కారం చూపాలని, ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో టీఆర్ఎస్, బీజేపీ వివాదాలు సృష్టిస్తున్నాయని, తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు సమస్యలను పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. దాడులు, ప్రతిదాడులతో గందరగోళం సృష్టిస్తున్నారని పెట్టుబడులను గుజరాత్ కు తరలించుకుపోయేందుకు మోదీ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఇది తెలంగాణకు తీరని నష్టం చేస్తుందని, పంతాలు, పట్టింపులతో కేసీఆర్, మోదీ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని అన్నారు. రాష్ట్రం ప్రశాంతంగా ఉండాలంటే అది కాంగ్రెస్ తోనే సాధ్యమని, ఢిల్లీ లిక్కర్ స్కామ్, ఎమ్మెల్యేల కొనుగోళ్ల అంశంతో ప్రజా సమస్యలు చర్చకు రాకుండా చేస్తున్నారని మండిపడ్డారు.