- బాహుపేట క్రాస్ రోడ్డు వద్ద ఆర్టీసీ బస్సు, బైకు ఢీ
- బైకుపై ఉన్న ఇద్దరి మృతి
- బంధువు అంత్యక్రియలకు వెళ్లివస్తుండగా ఘటన
- ధర్మసాగర్లో తీవ్ర విషాదం
అక్షరశక్తి, హసన్పర్తి : రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అన్నదమ్ములు దర్మరణం చెందారు. బంధువు అంత్యక్రియలకు వెళ్లి వస్తుండగా బైకు, ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో మృతి చెందారు. ఈ ఘటన హసన్పర్తి మండలం ఎల్లాపూర్ శివారు బాహుపేట క్రాస్ రోడ్డు వద్ద మంగళవారం మధ్యాహ్నం సుమారు 2గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి… హన్మకొండ జిల్లా స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గం ధర్మసాగర్ మండల కేంద్రానికి చెందిన బొడ్డు సుదర్శన్(58), బొడ్డు సోమయ్య(55) అన్నదమ్ములు. సుదర్శన్కు భార్య యాదమ్మ, ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. గ్రామంలోనే వ్యవసాయం చేసుకుంటూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. సోమయ్యకు భార్య శోభ, ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. సోమయ్య భార్య శోభ ధర్మసాగర్ ఎంపీటీసీగా కొనసాగుతున్నారు. - అయితే.. హసన్పర్తి మండలం ఎల్లాపూర్ శివారులోని బాహుపేటలో దగ్గరిబంధువు మృతి చెందగా, అన్నదమ్ములు సుదర్శన్, సోమయ్యలు బైకుపై వెళ్లారు. అక్కడ అంత్యక్రియలు ముగిసిన తర్వాత ఇద్దరు కలిసి బైకుపై తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో వరంగల్ – కరీంనగర్ జాతీయ రహదారిపై బాహుపేట క్రాస్ వద్ద రోడ్డు దాటుతుండగా కరీంనగర్ నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడిన అన్నదమ్ములిద్దరినీ 108వాహనంలో ఎంజీఎంకు తరలిస్తుండగా మార్గమధ్యలోనే వారు మృతి చెందినట్లు సీఐ తుమ్మ గోపి తెలిపారు. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. ఎంజీఎంలో మృతదేహాల వద్ద రోదిస్తున్న బంధువులను స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పరామర్శించి ఓదార్చారు.
Must Read