Saturday, July 27, 2024

ద‌ద్ద‌రిల్లిన తూర్పు!

Must Read
  • అట్ట‌హాసంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్య‌ర్థి న‌న్న‌పునేని న‌రేంద‌ర్ నామినేష‌న్‌
  • వేలాదిగా త‌ర‌లివ‌చ్చిన పార్టీ శ్రేణులు, అభిమానులు
  • గులాబీమ‌య‌మైన వ‌రంగ‌ల్
  • జై కేసీఆర్‌.. జై కేటీఆర్‌.. జై న‌రేంద‌ర్ నినాదాల‌తో హోరెత్తిన న‌గ‌రం
  • నేను లోక‌ల్.. ఆద‌రించండి అండ‌గా ఉంటా..
    న‌న్న‌పునేని న‌రేంద‌ర్‌
  • నామినేష‌న్‌లో పాల్గొన్న బండా ప్ర‌కాశ్‌, గుండు సుధారాణి, బ‌స్వ‌రాజు సార‌య్య

అక్ష‌ర‌శ‌క్తి, వ‌రంగ‌ల్ తూర్పు : వ‌రంగ‌ల్‌తూర్పు నియోజ‌క‌వ‌ర్గం గులాబీమ‌య‌మైంది. జై కేసీఆర్‌.. జై కేటీఆర్‌.. జై న‌రేంద‌ర్‌.. నినాదాల‌తో హోరెత్తింది. వ‌రంగ‌ల్ తూర్పు నియోజ‌క‌వ‌ర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్య‌ర్థిగా న‌న్న‌పునేని న‌రేంద‌ర్ శుక్ర‌వారం నామినేష‌న్ దాఖ‌లు చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో అట్ట‌హాసంగా సాగింది. వేలాదిగా త‌ర‌లివ‌చ్చిన పార్టీ శ్రేణులు, అభిమానుల‌తో దారుల‌న్నీ కిక్కిరిసిపోయాయి. శివనగర్ లోని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ నివాసం నుండి ప్రారంభమైన నన్నపునేని నరేందర్ నామినేషన్ ర్యాలీ పోస్టాఫీస్‌, చౌరస్తా, జేపీన్ రోడ్, మండిబజార్, పోచంమైదాన్, గోపాలస్వామి గుడి, ఎంజీఎం సర్కిల్ మీదుగా సుమారు వేలాదిమందితో ముందుకు సాగింది. ఈ ర్యాలీలో శాసనమండలి డిప్యూటీ చైర్మ‌న్‌, బీఆర్ఎస్ వరంగల్ తూర్పు ఇన్‌చార్జ్‌ బండా ప్రకాష్‌తోపాటు ప‌లువురు నాయ‌కులు పాల్గొన్నారు. డబ్బు చప్పుళ్లు, మహిళల కోలాటాలు, కళాకారుల ఆటపాటల‌తో కార్యకర్తల కేరింతల నడుమ నినాదాలతో వ‌రంగ‌ల్ నియోజ‌క‌వ‌ర్గం దద్దరిల్లింది. ఎంజీఎం సెంటర్‌లో భారీ గజమాలతో శాసనమండలి డిప్యూటీ చైర్మ‌న్‌, ఎమ్మెల్యే నరేందర్‌కు గజమాలతో స్వాగ‌తం ప‌లికారు. ఈ సందర్భంగా శాసనమండలి డిప్యూటీ చైర్మ‌న్‌ బండా ప్రకాష్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, మేయర్ గుండు సుధారాణి, డిప్యూటీ మేయర్ రిజ్వానా షమిమ్ మసూద్, బొల్లం సంపత్ యాదవ్, కార్పొరేటర్లు సోమిశెట్టి ప్రవీణ్, బైరబోయిన ఉమా దామోదర్ యాదవ్, భోగి సువర్ణ సురేష్, పోశాల పద్మ స్వామి గౌడ్‌తో క‌లిసి న‌న్న‌పునేని న‌రేంద‌ర్‌ నామినేషన్ సమర్పించారు.

అనంతరం న‌రేంద‌ర్ మాట్లాడుతూ… ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో వరంగల్ తూర్పు ప్రజల ఆశీర్వాదంతో గత ఐదేండ్లలో ఎంతో అభివృద్ధి చేశాన‌ని అన్నారు. తాను చేసిన అభివృద్ధి మీ కళ్ల‌ముందు ఉందని అన్నారు. నేను లోకల్.. అండర్ బ్రిడ్జి దగ్గరే నా ఇల్లుంది.. అందరికి అందుబాటులో ఉన్న నన్ను గెలిపించండి.. అండగా ఉంటా.. అని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ మార్గనిర్దేశంలో ఈ నియోజకవర్గాన్ని మరింత ముందుకు తీసుకొని వెళ్తాన‌ని అన్నారు. ఓరుగల్లు తూర్పు ప్రజల దీవెనలతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నా.. ఆదరించండి.. కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించండి.. అని కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్య‌లో పాల్గొన్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img