- ఆర్పీఐ(అథవాలె) ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ
- మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలిగా బాధ్యతలు
- దశాబ్దకాలంగా దళితబహుజల కోసం ఉద్యమం
- స్నేహ హెల్పింగ్ సొసైటీతో సామాజిక సేవ
అక్షరశక్తి, వర్ధన్నపేట : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గంలో ఆర్పీఐ(అథవాలె) పార్టీ సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు తెలంగాణ ఉద్యమకారిణిగా, సామాజిక సేవకురాలిగా, నిత్యం దళితబహుజనుల హక్కుల గొంతుకగా గుర్తింపు ఉన్న పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు సరిగొమ్ముల స్నేహలత ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. వర్ధన్నపేట ప్రాంతంలో విస్తృతంగా పర్యటించి, ప్రజా సమస్యలపై ఉద్యమించిన ఆమెకు టికెట్ రావడంపై పార్టీ శ్రేణుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఈ ఎన్నికల్లో ఆర్పీఐ(అథవాలె) పార్టీ సత్తా చాటుతామని ఎమ్మెల్యే అభ్యర్థి స్నేహలత ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్థాపించిన ఆర్పీఐ(అథవాలె) పార్టీకి అండగా నిలబడుతారన్న నమ్మకం ఉందని ఆమె అంటున్నారు. ఎన్నో ఏళ్లుగా ఆయా వర్గాల హక్కుల కోసం, వారి సమస్యల పరిష్కారం కోసం అవిశ్రాంతంగా పార్టీ పోరాడుతోందని, అలాంటి పార్టీని ఆదరించాలని కోరుతున్నారు.
దశాబ్దకాలంగా సామాజిక ఉద్యమాల్లో…
సరిగొమ్ముల స్నేహలత సుమారు దశాబ్దకాలానికిపైగా సామాజిక ఉద్యమాల్లో పాల్గొంటున్నారు. ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల తరుపున నిలబడి పోరాడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలోనూ చురుకైన పాత్ర పోషించారు. ఆ తర్వాత ఆర్పీఐ(అథవాలె) పార్టీలో చేరి అంచెలంచెలుగా ఎదిగారు. ప్రస్తుతం ఆర్పీఐ(అథవాలె) మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలిగా కొనసాగుతున్న స్నేహలత.. పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు పసుల రవికుమార్ నాయకత్వంలో పార్టీ బలోపేతం కోసం విస్తృతంగా కృషి చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ.. గ్రామ స్థాయి నుంచి పార్టీ నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. కమిటీలు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే పార్టీ అధిష్ఠానం స్నేహలతను గుర్తించి ఉమ్మడి వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం కల్పించింది. ఈ ప్రాంతంలో పట్టున్న నాయకురాలిగా గుర్తింపు ఉన్న స్నేహలత వర్ధన్నపేటలో ఆర్పీఐ(అథవాలె) సత్తాచాటేందుకు సిద్ధమవుతున్నారు.
నియోజకవర్గంలో హోరాహోరీ..
వర్ధన్నపేట నియోజవకర్గంలో ఈసారి హోరాహోరీ పోరు ఖాయంగా కనిపిస్తోంది. ప్రధాన పార్టీలు అయిన కాంగ్రెస్ నుంచి కేఆర్ నాగరాజు, బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే అరూరి రమేష్, బీజేపీ నుంచి కొండేటి శ్రీధర్ బరిలో ఉంటున్నారు. ఇక ఆర్పీఐ(అథవాలె) పార్టీ నుంచి సరిగొమ్ముల స్నేహలత పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. ఎవరికివారు తమ సత్తాచాటేందుకు సిద్ధమవుతున్నారు. హ్యాట్రిక్ విజయం సాధించాలని అరూరి, వర్ధన్నపేటలో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని కేఆర్ నాగరాజు, బీజేపీ సత్తా చాటాలని కొండేటి శ్రీధర్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఇదే సమయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల గొంతుకగా ఉన్న ఆర్పీఐ(అథవాలె) పార్టీ కూడా తన సత్తా చూపిస్తుందని, ఆయా వర్గాలు తమకే మద్దతుగా ఉంటాయని ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సరిగొమ్ముల స్నేహలత ధీమా వ్యక్తం చేస్తున్నారు.