- రేపు భూపాలపల్లి, ములుగులో కేసీఆర్ ఎన్నికల ప్రచార సభ
- గత జూలై వరదబీభత్సంలో కొట్టుకుపోయిన మోరంచపల్లి, కొండాయి
- సర్వం కోల్పోయిన రెండు గ్రామాల ప్రజలు
- అయినా కన్నెత్తి చూడని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్
- ఇప్పుడు ఎన్నికల ప్రచారానికి వస్తుండడంపై ప్రజల్లో తీవ్ర విమర్శలు
- రెండు నియోజకవర్గాల జనంలో ఆవేదన
అక్షరశక్తి, భూపాలపల్లి : భూపాలపల్లి జిల్లా మోరంచపల్లి, ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం కొండాయి.. ఈరెండు గ్రామాల పేర్లు వింటేచాలు! వరద బీభత్సంలో ఊర్లు కొట్టుకుపోయి.. సర్వం కోల్పోయిన దృశ్యాలతో ఒక్కసారిగా గుండెలు బరువెక్కుతాయి. అయిన వారిని వరదమింగేసిన కన్నీటిగాథలే వెంటాడుతాయి. అంతటి మరణ వేదనను ఓదార్చడానికి కనీసం ముఖ్యమంత్రి కేసీఆర్గానీ, మంత్రి కేటీఆర్గానీ రాలేదు.. కనీసం ఇటువైపు కన్నెత్తి చూడలేదు.. ఆఖరికి వారిని తీసుకొచ్చి బాధితులను ఓదార్చడంలో స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి కూడా విఫలం చెందారు. కానీ.. భూపాలపల్లితోపాటు ములుగులో శుక్రవారం ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ప్రచార సభలకు రానుండడంపై ప్రజలు మండిపడుతున్నారు.
ఊర్లు కొట్టుకుపోయినా రాలేదుగానీ.. ఓట్ల కోసం వస్తున్నారా..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పుట్టెడు దుఃఖంలో ఉన్న ప్రజలను పలకరించి భరోసా ఇవ్వని సీఎం కేసీఆర్.. ఇప్పుడెందుకు ఇక్కడికి వస్తున్నారంటూ తీవ్రస్థాయిలో విమర్శలు వినిపిస్తున్నాయి. గత జూలై చివరివారంలో కురిసిన భారీ వర్షాలకు ఈ రెండు గ్రామాల ప్రజలు సర్వం కోల్పోయారు. వరదలో కొట్టుకుపోయి మోరంచపల్లి, కొండాయిలో పలువురు మృతి చెందారు. ఆ సమయంలో ఈ రెండు గ్రామాలు దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచాయి. వరదలో కొట్టుకుపోయి ముళ్లపొదల్లో.. చెట్ల కొమ్మల్లో.. ఇసుకలో కూరుకుపోయిన పలువురి మృతదేహాలు.. ప్రజల గుండెల్ని పిండేసాయి.అయ్యో.. అంటూ కన్నీటిపర్యంతమయ్యారు. కానీ.. ముఖ్యమంత్రి కేసీఆర్గానీ, మంత్రి కేటీఆర్గానీ.. ఈ రెండు గ్రామాల వైపు కన్నెత్తి చూడలేదు. వారిని ఓదార్చలేదు. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా భూపాలపల్లి, ములుగులో శుక్రవారం నిర్వహిస్తున్న ప్రచార సభలకు కేసీఆర్ వస్తుండడంపై జనం నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.