- లేనిపక్షంలో మూకుమ్మడి రాజీనామాలు చేస్తాం..
- సిటీ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు కట్ల శ్రీనివాస్, కార్పొరేటర్లు జక్కుల రవీందర్ యాదవ్, విజయశ్రీ సయ్యద్ రజాలి
అక్షరశక్తి, వరంగల్ పశ్చిమ : వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో సిటీ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు కట్ల శ్రీనివాస్, 62వ డివిజన్ కార్పొరేటర్ జక్కుల రవీందర్ యాదవ్, 63వ డివిజన్ కార్పొరేటర్ విజయశ్రీ సయ్యద్ రజాలి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. వరంగల్ పశ్చిమ నుండి కాంగ్రెస్ పార్టీలో జంగా రాఘవరెడ్డికే టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనునిత్యం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కష్టకాలంలో అండగా ఉంటూ ప్రతీ కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడిన వ్యక్తి జంగా రాఘవరెడ్డి అని, గతంలో అధిష్టానం ఆదేశాల అనుసారంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎక్కడ బాధ్యతలు ఇచ్చినా సక్రమంగా నిర్వహించి యావత్ జిల్లా కాంగ్రెస్ పార్టీని కాపాడిన వ్యక్తి జంగా రాఘవరెడ్డి అని అన్నారు. 2016లో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 4 డివిజన్లలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించిన ఘనత రాఘవరెడ్డికి ఉన్నదని, 2021లో జరిగిన గ్రేటర్ వరంగల్ మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఇద్దరు కార్పొరేటర్లను గెలిపించారని అన్నారు. అనునిత్యం ప్రజల్లో ఉంటూ ప్రత్యక్షంగా కష్టసుఖాలు తెలుసుకునే నాయకుడని అన్నారు.
జంగా రాఘవ రెడ్డి పైసలకు అమ్ముడుపోయే వ్యక్తి కాదని, కాంగ్రెస్ పార్టీ కోసం అహర్నిశలు కష్టపడే వ్యక్తి అని, వ్యక్తిత్వాన్ని కానీ కాంగ్రెస్ పార్టీ అస్తిత్వాన్ని కానీ ఎక్కడా కూడా తాకట్టు పెట్టిన దాఖలాలు లేవు అని అన్నారు. ఇలాంటి నాయకునికి వరంగల్ పశ్చిమలో టికెట్ ఇవ్వాలని, భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని కోరారు. ఒకవేళ టికెట్ ఇవ్వని యెడల మూకుమ్మడి రాజీనామాలకు వెనుకాడబోమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, కంటెస్టెడ్ కార్పొరేటర్లు, డివిజన్ల అధ్యక్షులు, మాజీ అధ్యక్షులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మాజీ కౌన్సిలర్లు, యూత్ కాంగ్రెస్ నాయకులు, మహిళా నాయకులు తదితరులు పాల్గొన్నారు