32.5 C
Hyderabad
Homeతెలంగాణకృష్ణాన‌ది ఒడ్డున వ‌రుణ‌యాగం

కృష్ణాన‌ది ఒడ్డున వ‌రుణ‌యాగం

అక్ష‌ర‌శ‌క్తి, హైద‌రాబాద్ : రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురవాలని దేవీదేవతలను వేడుకుంటూ ప్రభుత్వం నిర్వహించిన మహా వరుణయాగం వేదపండితుల మంత్రోచ్ఛారణలు, వైదిక క్రతువుల మధ్య శాస్త్రోక్తంగా, భక్తిశ్రద్ధలతో సంపూర్ణమైంది. నాగార్జునసాగర్‌లోని విజయ్ విహారం వద్ద కృష్ణా నది ఒడ్డున నిర్వహించిన ఈ పవిత్ర వరుణ యాగంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దంపతులు పాల్గొని రుత్వికుల మార్గదర్శకత్వంలో యాగక్రతువులను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు.

యాద‌గిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయ అర్చకులు, వేదపండితుల ఆధ్వర్యంలో 108 మంది రుత్వికులతో 11 హోమగుండాలతో వరుణదేవుని అనుగ్రహాన్ని ఆకాంక్షిస్తూ వైదిక విధానంలో హోమక్రతువులు నిర్వహించారు. ఈ పవిత్ర యాగంలో మంత్రి ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి దంపతులు పాల్గొన్నారు. దివ్యమైన ఆధ్యాత్మిక వాతావరణంలో కృష్ణా, గోదావరి పరీవాహక ప్రాంతాల్లో సమృద్ధిగా వర్షాలు కురవాలని ముఖ్యమంత్రి ప్రార్థించారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో, సుభిక్షంగా జీవించాలన్న సంకల్పంతో ఈ వరుణ యాగం నిర్వహించామని తెలిపారు.

భారతీయ సంస్కృతిలో వర్షాలు కురవాలని యాగాలు, యజ్ఞాలు, పూజలు నిర్వహించడం పూర్వీకుల నుంచి వస్తున్న ఆధ్యాత్మిక సంప్రదాయం. ఒకవైపు శాస్త్రీయ అంచనాలు, ప్రణాళికలతో ప్రభుత్వం ముందుకు వెళ్తూనే వర్షం, వ్యవసాయం, ప్రకృతి, మానవ జీవితం పరస్పర సంబంధాన్ని ప్రతిబింబించే సంస్కృతి, సంప్రదాయాలను గౌరవిస్తూ ప్రకృతి అనుగ్రహించాలని వేడుకున్నారు.

వాతావరణ శాఖ అంచనాల ప్రకారం ఎల్ నినో కారణంగా రాష్ట్రంలో ఈసారి వర్షపాతం సాధారణం కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ మహా వరుణయాగాన్ని నిర్వహించింది. “రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురవాలి. కృష్ణా గోదావరి నదులు నిండుగా ప్రవహించాలి. శ్రీశైలం, నాగార్జునసాగర్ లతో పాటు అన్ని ప్రాజెక్టులు నిండాలి. రాష్ట్రంలోని ప్రతి చెరువు, ప్రతి కుంట జలకళతో కళకళలాడాలి. భూగర్భ జలాలు పెరగాలి. పంటలు పుష్కలంగా పండాలి. రైతుల ముఖాల్లో చిరునవ్వులు కనిపించాలి. రాష్ట్రం సస్యశ్యామలంగా, సుభిక్షంగా, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలి” అని ముఖ్యమంత్రి గారు వరుణ దేవుడిని ప్రార్థించారు.

ఈ పవిత్ర వరుణయాగ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ గుత్త సుఖేంద‌ర్‌రెడ్డి, కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి, కొండా సురేఖ‌, ప్రభుత్వ సలహాదారులు కె.కేశవ రావు, పి. సుదర్శన్ రెడ్డి, మాజీ మంత్రి కె. జానారెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.

latest articles

explore more

App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.