అక్షరశక్తి, గూడూరు : మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలో డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ సంఘం సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమైంది. మండలంలో వివిధ పాఠశాలల ఉపాధ్యాయులతో సభ్యత్వాలు నమోదు చేయించారు. ఈ సందర్భంగా సంఘ నాయకులు మాట్లాడుతూ.. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని అన్నారు. సాక్షాత్తు తెలంగాణ ముఖ్యమంత్రి పిఆర్సి నివేదికను తక్షణమే తెప్పించుకొని అమలు చేస్తానని హామీ ఇచ్చారని, ఇది జరిగి మూడు నెలలు గడిచినా నివేదిక మాత్రం ఇంతవరకు తెప్పించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 2023 జూలై 1 నుంచి అమలు కావలసిన పిఆర్సి మూడు సంవత్సరాలు పూర్తయినా అమలుకు నోచుకోలేదని అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ ఉద్యోగస్తులకు ఆరు డీఏలు పెండింగ్లో ఉన్నాయని, పోరాటాలతోనే సమస్యలను పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా డిటిఎఫ్ మండల డిటిఎఫ్ నాయకులు ఈసాల లక్ష్మయ్య, గుంటి శ్రీనివాస్, ఇస్లావత్ చందా, గజ్జి మల్లేష్ బోడ దూప్ సింగ్ లింగాలమణి తదితరులు పాల్గొన్నారు.
