అక్షరశక్తి, భూపాలపల్లి : భూపాలపల్లి నియోజకవర్గ పరిధిలో అక్టోబర్ 9వ తేదీన తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలన శాఖ మంత్రి కేటీఆర్ పర్యటన ఉంటుందని, వారి పర్యటన నేపథ్యంలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, సంక్షేమ పథకాలు అమలు ఉంటాయని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి అన్నారు. శనివారం భూపాలపల్లిలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సోమవారం ఉదయం హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో భూపాలపల్లికి కేటీఆర్ చేరుకుంటారని, భూపాలపల్లిలో నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టర్ కార్యాలయం, జిల్లా పోలీస్ శాఖ కార్యాలయం ప్రారంభిస్తారని తెలిపారు. జిల్లా కేంద్రంలో నిర్మించిన 2 ఫేస్ డబుల్ బెడ్ రూమ్ లను లబ్దిదారులకు, నూతనంగా వచ్చిన 1100 మంది లబ్దిదారులకు దళితబంధు అమలు పత్రాలను అందిస్తారని అన్నారు. నియోజకవర్గ పరిధిలోని ఇప్పటికే 3000 గృహాలక్ష్మి ఇళ్లు మంజూరు అయ్యాయని, ముఖ్యమంత్రి కేసీఆర్ మరో 1500కూడా అదనంగా మంజూరు చేశారని తెలిపారు. మంత్రి కేటీఆర్ పర్యనలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.