- 90 లీటర్ల నాటుసారాయి, మూడు వాహనాలు సీజ్
- ఏడుగురిపై కేసు నమోదు
అక్షరశక్తి, గూడూరు : వరంగల్ డిప్యూటీ కమిషనర్ అంజన్ రావు, మహబూబాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ బి కిరణ్ ఆదేశాల మేరకు గూడూరు ఎక్సైజ్ సీఐ ఎన్ భిక్షపతి, ఎస్సై జయశ్రీ ఆధ్వర్యంలో కేసముద్రం మండలం భవానిగడ్డ తండాలో నాటుసారాయి కేంద్రాలపై దాడులు నిర్వహించారు. ఒక అశోక్ లెలాండ్ గూడ్స్ వాహనం, ఒక టీవీఎస్ మోపెడ్, పల్సర్ మోటార్ సైకిల్ లలో నల్లబెల్లం, నాటు సారాయి తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో 20 బస్తాల నల్లబెల్లం, రెండు బస్తాల పట్టిక సుమారు 90 లీటర్ల నాటు సారాయి స్వాధీనం చేసుకుని సుమారు 300 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు. మూడు వాహనాలను స్వాధీనం చేసుకొని భవానిగడ్డ తండాకు చెందిన నునావత్ కిషన్, నునావత్ రాము, నునావత్ వీరు, ఇప్పల్ తండా కు చెందిన ధరావత్ లచ్చిరామ్, అశోక్ లేలండ్ డ్రైవర్ ఇరుగడిండ్ల నాగయ్య, కున్సోత్ తండాకు చెందిన కున్సోత్ మంజుల, భూక్యా సురేష్ లపై కేసు నమోదు చేసినట్లు ఎక్సైజ్ సీఐ ఎన్ భిక్షపతి తెలిపారు. ఈ దాడుల్లో ఎస్సై జయశ్రీ, కానిస్టేబుళ్లు సుధాకర్, వెంకన్న, యుగంధర్, దేవేందర్లు పాల్గొన్నారు.