అక్షరశక్తి వరంగల్: సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని.. వాటి నివారణకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదా అధికారులకు సూచించారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో సీజనల్ వ్యాధులపై కలెక్టర్ సత్య శారదా సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వైద్యారోగ్య శాఖతో పాటు మున్సిపల్, పంచాయతీ తదితర శాఖలు కూడా పరస్పర సమన్వయంతో పనిచేస్తూ, సీజనల్ వ్యాధుల నివారణకు కృషి చేయాలన్నారు. సీజనల్ వ్యాధులు సోకకుండా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. పారిశుధ్య కార్యక్రమాలను క్రమం తప్పకుండా చేపట్టాలని.. ఎకడైనా నీరు నిల్వ ఉన్నట్లు గమనిస్తే ఆయిల్బాల్స్ వేయాలని, దోమలు వ్యాప్తి చెందకుండా ఫాగింగ్ చేయించాలన్నారు. ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సీజనల్ వ్యాధుల నివారణకు సంబంధించిన మందులను అందుబాటులో ఉంచాలని, వ్యాధుల పరిస్థితిపై రోజువారీగా నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. డెంగీ కేసు నమోదైన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి తక్షణమే నివారణ చర్యలు చేపట్టాలని, పరిస్థితిని ఉన్నతాధికారులకు తెలియజేయాలన్నారు. ప్రతి శుక్రవారం డ్రై డే నిర్వహించాలని, అన్ని ఇండ్లు, సంస్థల్లో కార్యక్రమాన్ని చేపట్టి, నిల్వ ఉన్న నీటిని బయట పారబోసి దోమలు వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మండల అధికారులు, గ్రామస్థాయి స్పెషల్ అధికారులు ఎల్లప్పుడు అందుబాటులో ఉండి గ్రామాల్లో రోజువారీగా నిర్వహించే పనులను విధిగా చేయించాలని.. తాగునీరు, వీధిదీపాలు, పారిశుధ్యంపై ప్రతిరోజూ నివేదికలు పంపించాలని డీపీవోకు కలెక్టర్ సూచించారు. అధికారులు గ్రామాల వారీగా సందర్శించాలన్నారు. స్వయం సహాయక మహిళ సంఘాల ద్వారా గ్రామాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన ముందస్తు నివారణ చర్యలపై చైతన్యం కల్పించాలని డిఆర్డీఓ ను సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారిణి కౌసల్యదేవి, జడ్పీ సీఈవో రామిరెడ్డి, డిఎంహెచ్ ఓ డాక్టర్ వేంకట రమణ, డీఈఓ వాసంతి,జిల్లా సంక్షేమ శాఖ అధికారి హైమావతి, జిల్లా గిరిజన సంక్షేమ, మైనారిటీ శాఖ అధికారి సౌజన్య, జిల్లా బిసి సంక్షేమ అధికారి పుష్ప, జిల్లా ఎస్సి సంక్షేమ అధికారి భాగ్యలక్ష్మి, సిఎంహెచ్ ఓ డాక్టర్ రాజేష్, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.