కామంతో కళ్లు మూసుకుపోయి కూతురిపైనే పలుమార్లు లైంగికదాడికి పాల్పడిన మానవ మృగానికి న్యాయస్థానం పదేళ్ల జైలు శిక్ష విధించింది. వివరాల్లోకి వెళ్తే… వరంగల్ కాశీబుగ్గకు చెందిన కోడం ప్రవీణ్ ఓ మహిళను వితంతు వివాహం చేసుకున్నాడు. ఆ మహిళకు అప్పటికే కుమారుడు, కూతురు ఉన్నారు. అంతా ఒకే ఇంట్లో ఉండేవారు. భార్యకు 17 ఏళ్ల వయసు గల కూతురు హైదరాబాద్ లోని ఓ కళాశాలలో ఇంటర్ చదువుతోంది. దీపావళి సందర్భంగా వరంగల్ లోని తన తాత ఇంటికి వచ్చింది. తాత ఇంటికి వచ్చిన ప్రవీణ్ కూతురు అవుతుందని కూడా ఆలోచించకుండా బెదిరించి ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఎవరికైనా చెప్తే చంపుతానని బెదిరించాడు. ఈ ఘటన తర్వాత మళ్లీ హైదరాబాద్ వెళ్ళిన బాలికను తన పుట్టినరోజు సందర్భంగా వరంగల్కు తీసుకువచ్చి మళ్ళీ లైంగికదాడికి పాల్పడి బెదిరిం చాడు. మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిన ఆ బాలిక జరిగిన ఘోరాన్ని ఆమె పిన్నికి చెప్పింది. జరిగిన విషయాన్ని బాలిక తల్లికి చెప్పి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరిపి న్యాయస్థానంలో నేర ఆరోపణల పత్రాన్ని దాఖలు చేశారు. కేసు విచారణలో నేరం రుజువు కావడంతో న్యాయస్థానం నిందితుడికి 10 సంవత్సరాల జైలు శిక్ష విధించింది.