- వరంగల్ కమిషనరేట్ పరిధిలో సీఐల సస్పెన్షన్కు రంగం సిద్ధం !
- జాబితా రెడీ.. త్వరలోనే ఉత్తర్వులు ?
- అవినీతి అధికారులపై సీపీ రంగనాథ్ ఉక్కుపాదం
- నెల రోజుల వ్యవధిలోనే
ఓ సీఐ, ఇద్దరు ఎస్సైలు, ఏఎస్ఐ, కానిస్టేబుల్ సస్పెన్షన్.. - తాజాగా గోల్డ్ స్టోన్ వ్యాపారిని బెదిరించిన ఘటనలో ఆర్ఐ అరెస్ట్
- నేడో రేపో సదరు అధికారిపై సస్పెన్షన్ వేటు !
- అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు
అవినీతి పోలీస్ అధికారులపై సీపీ రంగనాథ్ ఉక్కుపాదం మోపుతున్నారు.
వరంగల్ పోలీస్ కమిషనర్గా కొత్తగా బాధ్యతలు చేపట్టిన ఆయన ముందుగా సొంత ఇంటిని చక్కదిద్దే పనిలో బిజీగా ఉన్నారు. డిసెంబర్ 3న బాధ్యతలు చేపట్టిన సీపీ రంగనాథ్ నెల రోజుల్లోనే నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన ఐదుగురిపై వేటు వేశారు. ఓ సీఐ, ఇద్దరు ఎస్సైలు, ఏఎస్సైతోపాటు కానిస్టేబుల్ ను విధుల నుంచి సస్పెండ్ చేశారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. భూతగాదాలు, సెటిల్మెం ట్లు, వివాహేతర సంబంధాలు, స్టేషన్కు వచ్చే బాధితులతో అసభ్యకరంగా ప్రవర్తించే కిందిస్థాయి సిబ్బం ది నుంచి ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి వరకు సమాచారం సేకరించినట్టు తెలుస్తోంది. వీరిపై దశలవారీగా చర్యలు తీసుకునేందుకు సిద్ధమైనట్లు సమాచారం. అందులో భాగంగానే గ్రేటర్ పరిధిలోని పోలీస్స్టేషన్లనలో విధులు నిర్వహిస్తున్న నలుగురు సీఐలపై కొరఢా ఝలిపించేందుకు రెడీ అవుతు న్నట్లు తెలుస్తోంది. ఆ నలుగురి జాబితా రెడీ అయిందని, త్వరలోనే సస్పెన్షన్ ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం.
ఎవరా నలుగురు ?
అక్రమార్కుల భరతం పట్టేందుకు సీపీ రంగనాథ్ ప్రత్యేక కార్యాచరణ రూపొందించి ముందుకెళ్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే కమిషనరేట్ పరిధిలో ముఖ్యంగా నగరంలోని ప్రధాన పోలీస్ స్టేషన్లో ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులు నలుగురు సస్పెన్షన్ జాబితాలో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. వరంగల్లోని రెండు ప్రధాన పోలీస్ స్టేషన్లలో ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్న వారితోపాటు హనుమకొండలో మరో ఇద్దరు ఇన్స్పెక్టర్లు సస్పెన్షన్ వేటుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో
ఒక ఇన్స్పెక్టర్ భూతగాదాలు, సెటిల్మెంట్లు చేస్తున్నట్లు సీపీకి సమాచారం అందినట్లు తెలుస్తోంది. మరొక ఇన్స్పెక్టర్ వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్లు వినికిడి. మరో ఇద్దరు పీడీఎస్ బియ్యం దందాతోపాటు మామూళ్లు, బార్ షాపుల నుంచి నెల నెలా వసూళ్లకు పాల్పడుతన్నట్లు సీపీకి ఫిర్యాదులు అందినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ క్రమంలోనే ఆ నలుగురిపై విచారణ పూర్తయిందని, త్వరలోనే వీరిని విధులనుంచి సస్పెండ్ చేసేందుకు సీపీ సిద్ధం అవుతున్నారని సమాచారం.
ఆర్ఐ సతీష్ అరెస్ట్.. రిమాండ్..
రంగురాళ్ల వ్యాపారిని బెదిరించిన ఘటనలో ఆర్ఐ సతీష్ను సుబేదారి పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేసి పరకాల సబ్ జైలుకు తరలించారు. ఆర్ఐపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన పోలీస్ ఉన్నతాధికారులు అతడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించాలని ఆదేశించారు. ఆర్ఐ సతీష్ ప్రస్తుతం వరంగల్ పోలీస్ కమిషనరేట్లో విధులు నిర్వహిస్తున్నారు. కాగా అవినీతి ఆరోపణలతో అరెస్టై జైల్లో ఉన్న ఆర్ఐ సతీష్ను విధుల నుంచి సస్పెండ్ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. నేడో రేపే సీపీ ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉందని సమాచారం.