- వైఎస్సాఆర్ హయాంలో తిరుగులేని నాయకులుగా గుర్తింపు
- 2007 -13 వరకు ఎమ్మెల్సీగా పద్మావతి..
- ఐదుసార్లు స్టాండింగ్ కమిటీ చైర్మన్గా భాస్కర్..
- ఉమ్మడి జిల్లాలో విస్తృతమైన ప్రజాసంబంధాలు
అక్షరశక్తి, వరంగల్ : పార్లమెంట్ ఎన్నికల్లో ఎస్సీ రిజర్వుడ్ స్థానం వరంగల్ కాంగ్రెస్ టికెట్ కోసం ఆశావహుల మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. చివరి వరకూ ఎవరి స్థాయిలో వారు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే టికెట్ కేటాయింపు ఉత్కంఠ బుధవారం సాయంత్రం నాటికి వీడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా దొమ్మటి సాంబయ్య, పరంజ్యోతి, బొడ్డు సునీత, ఇందిర, హరికోట్ల రవి, డాక్టర్ బరిగెల రమేష్తోపాటు తాజాగా, మాజీ ఎమ్మెల్సీ పుల్ల పద్మావతి కూడా టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. పలువురు నాయకులను కలిసి తన బయోడేటాను అందిస్తున్నారు. ఇటీవల బెంగళూరులో కాంగ్రెస్ నేత డీకే శివకుమార్తోపాటు మరికొందరు కీలక నేతలనూ కలిసి టికెట్ కేటాయించాలని విన్నవించారు.
వైఎస్సార్ హాయంలో…
వైఎస్సార్ హయాంలో వరంగల్లో పుల్ల దంపతులు పద్మావతి – భాస్కర్ తిరుగులేని నేతలుగా వెలుగొందారు. పార్టీలో అత్యంత కీలక పాత్ర పోషించారు. ప్రధానంగా వైఎస్సార్కు అత్యంత సన్నిహితులుగా గుర్తింపు పొందారు. కాంగ్రెస్ పార్టీలో అత్యంత నమ్మకస్తులుగా ఉంటూ అంచెలంచెలుగా ఎదిగారు. ఈ క్రమంలో 1999 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పరకాల నుంచి పుల్ల పద్మావతి పోటీ చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వర్తించారు. పీసీసీ సభ్యురాలిగానూ ఆమె పనిచేశారు. ఈ క్రమంలో 2007 నుంచి 2013వరకు పుల్ల పద్మావతి ఎమ్మెల్సీగా కొనసాగారు. అనంతరం చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో వైఎస్సార్సీపీ పొలిట్బ్యూరో సభ్యురాలిగా ఆమె కొనసాగారు. ప్రధానంగా గ్రేటర్ వరంగల్లో తిరుగులేని కాంగ్రెస్ నాయకుడిగా పుల్ల భాస్కర్ ఎదిగారు. 1987 నుంచి 2007 వరకు కార్పొరేటర్గా ఉన్నారు. ఆరేళ్లు సిటీ యూత్కాంగ్రెస్ ప్రెసిడెంట్గా, ఉమ్మడి వరంగల్ జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా భాస్కర్ బాధ్యతలు నిర్వర్తించారు. వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ చైర్మన్గా ఐదుసార్లు భాస్కర్ కొనసాగారు. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా విస్తృతమైన ప్రజాసంబంధాలు ఏర్పడ్డాయి.
టికెట్ కోసం ప్రయత్నాలు
ఈ పార్లమెంట్ ఎన్నికల్లో వరంగల్ టికెట్ కోసం పుల్ల దంపతులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం తాము అహర్నిశలు శ్రమించామని, అత్యంత కష్టకాలంలోనూ పార్టీని నమ్ముకుని ముందుకు నడిచామని, తమ పేరు పరిశీలించాలని కోరుతూ పలువురు నాయకులను పద్మావతి – భాస్కర్ దంపతులు కలిసారు. ఈ నేపథ్యంలో పార్టీ అధిష్ఠానం కూడా పుల్ల పద్మావతి పేరును పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. బుధవారం నాడు కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం ఉండడంతో పార్టీ శ్రేణులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి.