అక్షరశక్తి, హన్మకొండ : హనుమకొండ జవహర్ లాల్ నెహ్రూ స్టేడియాన్ని (జేఎన్ఎస్) రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (సాట్) డైరెక్టర్ డాక్టర్ కే.లక్ష్మి ఐఏఎస్ బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆమెకు హనుమకొండ డివైఎస్ఓ గుగులోత్ అశోక్ కుమార్ పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాటు చేసిన సింథటిక్ ట్రాక్ ను ఆమె పరిశీలించారు. అనంతరం సాట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రీజనల్ స్పోర్ట్స్ హాస్టల్లో మౌలిక వసతుల గురించి డివైఎస్ఓ అశోక్ కుమార్ ను అడిగి తెలుసుకున్నారు. హైదరాబాద్ తర్వాత హనుమకొండలో అతిపెద్ద స్టేడియం ఉందని, అనుభవజ్ఞులైన కోచ్ లు కూడా ఉన్నారని తెలిపారు. హనుమకొండలో అత్యధికమైన క్రీడా వసతుల ఏర్పాటు కోసం రూ.14 కోట్లతో ప్రతిపాదనలు పంపించామని వివరించారు. అంతకు ముందు సాట్ డైరెక్టర్ కొర్ర లక్ష్మి ప్రసిద్ధ భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో, ప్రధాన అర్చకులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో కోచ్లు, సిబ్బంది పాల్గొన్నారు.