అక్షరశక్తి డెస్క్: రోజు రోజుకు తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. అధికారంలో ఉన్న కాంగ్రేస్ పార్టీ ప్రటిపక్షంలో ఉన్న నాయకులను తమ పార్టీలో చేర్చుకుంటూ తమ బలాన్ని పెంచుకుంటున్నారు. దీనిపై ఇప్పటికే ప్రతిపక్షాల నుండి తీవ్రమైన వ్యతిరేకత వస్తున్నా అధికార పార్టీ మాత్రం తన వైఖరిని మార్చుకోనంటూంది. ఇదే క్రమంలో అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి, ఎంఐఎం ఎల్పీ లీడర్ అక్బరుద్దీన్ ఒవైసీ మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. అసెంబ్లీలో బడ్జెట్పై చర్చ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. అక్బరుద్దీన్ ఒవైసీ చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ బీ ఫామ్పై కొడంగల్ నియోజవర్గం నుండి పోటీ చేస్తే గెలిపించే బాధ్యత నేను తీసుకుంటానని, చీఫ్ ఎన్నికల ఏజెంట్గా ఉండి అక్బరుద్దీన్ను గెలుపు కోసం కృషి చేస్తానన్నారు. అక్బరుద్దీన్కు డిప్యూటీ సీఎం పోస్ట్ ఇచ్చి అసెంబ్లీలో నా పక్కనే కూర్చొబెట్టుకుంటానని రేవంత్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. రేవంత్ వ్యాఖ్యలపై వెంటనే అక్బరుద్దీన్ ఒవైసీ రియాక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా అక్బరుద్దీన్ మాట్లాడుతూ.. మజ్లిస్ పార్టీలో నేను సంతోషంగానే ఉన్నానని స్పష్టం చేశారు. తాను పార్టీ మారే ప్రసక్తే లేదని.. చివరి శ్వాస వరకు ఎంఐఎం పార్టీలోనే కొనసాగుతానని రేవంత్ కామెంట్స్కు కౌంటర్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి, అక్బరుద్దీన్ కామెంట్స్కు అసెంబ్లీలో హాల్లోని సభ్యులంతా నవ్వారు.