అక్షరశక్తి, ఖానాపూర్: వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద శనివారం ఖానాపూర్ మండల్ అశోక్ నగర్ లోని కస్తూర్భా (కేజీవిబి) స్కూల్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాల, అందులో ఉన్న అంగన్వాడీ కేంద్రంతో పాటు ఖానాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అశోక్ నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను తనిఖీ చేసి పిల్లల క్లాస్ రూమ్లు, వంట గదిలో ఉన్న, కూరగాయలు, ధాన్యం నిలువ గదిని పరిశీలించి సంతృప్తి వ్యక్తంచేశారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాల మరియు అంగన్వాడి కేంద్రాల్లో విద్యార్థులకు ఇచ్చే ఆహారం నాణ్యత ప్రమాణాలు పరిశీలనకు ఫుడ్ ఇన్స్పెక్టర్కు శాంపల్స్ పంపించాలని ఖానాపూర్ తహసీల్దార్ కిరణ్ కుమార్కు ఆదేశాలు ఇచ్చారు. అశోక్ నగర్ ప్రాథమిక పాఠశాల, అంగన్వాడి సెంటర్ తనిఖీలో భాగంగా ఆహారం నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడంతో స్కూల్ హెడ్ మాస్టర్, అంగన్వాడి టీచర్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ షోకాజ్ నోటీసులు జారీ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం నిర్దేశించిన పిల్లల ఆహార నియమాల పట్టిక (మెను) ప్రదర్శించాలని అంగన్వాడి టీచర్ ను ఆదేశించారు. వర్షాకాలం లో పాఠశాలల ఆవరణలో ఆట స్థలాలలో గుంతలు లేకుండా చూసుకోవాలని, నీటి నిల్వలు లేకుండా జాగ్రత్తపడవలసిందిగా, స్కూలు యజమాన్యం పూర్తి బాధ్యత తీసకోవాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.