అక్షరశక్తి , హన్మకొండ క్రైం : గ్రేటర్ వరంగల్ 62వ డివిజన్ కార్పొరేటర్ జక్కుల రవీందర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించగా, పరకాల సబ్ జైలుకు తరలించారు. కాజీపేట సోమిడి ప్రాంతంలో ఐదు గుంటల భూమి ఆక్రమణకు సంబంధించి కాంగ్రెస్ పార్టీకి చెందిన 62వ డివిజన్ కార్పొరేటర్ జక్కుల రవీందర్పై ఇటీవల మడికొండ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారానికి సంబంధించి భూమి యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు క్షేత్రస్థాయిలో ప్రాథమిక విచారణ జరిపిన పోలీసులు, రెవెన్యూ అధికారులు కార్పొరేటర్ జక్కుల రవీందర్ భూ ఆక్రమణకు పాల్పడినట్లుగా నిర్ధారణ కావడంతో ఆయనపై కేసు నమోదు చేశారు. కొద్ది రోజులుగా పరారీలో ఉన్న రవీందర్ను శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చగా న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ ఘటన గ్రేటర్ వరంగల్ పరిధిలో కలకలంరేపింది.