కరోనా మళ్లీ భయపెడుతోంది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కేసులు పెరుగుతున్నాయి. చైనాలో ఇప్పటికే వైరస్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఈ నేపథ్యంలోనే అప్రమత్తమైన కేంద్రం అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. రద్దీ ప్రాంతాల్లో మాస్క్ పెట్టుకోవాలని.. అందరూ తప్పకుండా వ్యాక్సిన్ వేసుకోవాలని సూచించింది. నిన్న కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్ సుఖ్ మాండవియా అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఇవాళ మధ్యాహ్నం ప్రధాని మోడీ అత్యవసర ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. కరోనా నియంత్రణకు చర్యలపై ఆయన అధికారులతో చర్చించ నున్నారు.
ఇండియాలో 4 కి చేరిన బీఎఫ్ 7 కేసులు..
ప్రపంచాన్ని వణికిస్తున్న కొత్త వేరియంట్ బీఎఫ్ 7 పాజిటివ్ కేసుల సంఖ్య ఇండియాలో 4కి చేరింది. ఇలాగే ఊరుకుంటే.. మరిన్ని కేసులు పెరగవచ్చనే ఉద్దేశంతో.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేడు మధ్యాహ్నం అత్యవసర ఉన్నతస్థాయి సమావేశానికి పిలుపిచ్చారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ మీటింగ్లో పాల్గొనబోతున్నారు. అలాగే ఆరోగ్య శాఖ మంత్రి, ఇతర సీనియర్ అధికారులు కూడా పాల్గొంటారని తెలుస్తోంది. ఈ వేరియంట్ తీవ్రంగా ఉన్న చైనా పక్కనే ఇండియా ఉండటం వల్ల.. భారతీయులు అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం ఇండియాలో 4 కేసులే నమోదవ్వడం వల్ల మనం ఆందోళన చెందాల్సిన పని లేదనీ.. కాకపోతే.. అప్రమత్తంగా ఉంటూ.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వాలు కోరుతున్నాయి. బీఏ 5 అనే ఒమైక్రాన్ వేరియంట్లో మార్పులు వచ్చి.. బీఎఫ్ .7 అనే వేరియంట్ తయారైంది. ఇదే చైనాలో కరోనా పెరిగేందుకు కారణం అయ్యింది. ఈ వైరస్ అత్యంత వేగంగా వ్యాపిస్తోందని, కాకపోతే ఎక్కువ కాలం బతకట్లేదు కానీ.. మళ్లీ మళ్లీ వ్యాపిస్తోందని అంటున్నారు. వ్యాక్సిన్ వేసుకున్న వారికి కూడా వైరస్ వ్యాపిస్తుండటంతో అందరూ అలర్ట్ అవుతున్నారు.