- ఎమ్మెల్యే అరూరి చొరవతో
ఏనుమాముల మార్కెట్లో పోలీస్ స్టేషన్ ఏర్పాటు - నూతన పోలీస్ స్టేషన్ను ప్రారంభించిన మంత్రి ఎర్రబెల్లి, ఎమ్మెల్యే రమేశ్
అక్షరశక్తి, హన్మకొండ క్రైం : ఆసియా ఖండంలోనే అతి పెద్దదైన ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో నూతన పోలీస్ స్టేషన్ బుధవారం ప్రారంభమైంది. దీంతో ఈ ప్రాంత ప్రజల చిరకాల కోరిక తీరగా, స్థానిక ఎమ్మెల్యే అరూరి రమేశ్ కృషి ఫలించింది. ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో నూతనంగా పోలీస్ స్టేషన్ ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉందని, పోలీసులు రైతులకు, వ్యాపారాస్తులకు ని రంతరం అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలలు అందించాలని బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ తెలిపారు. గ్రేటర్ వరంగల్ 14వ డివిజన్ పరిధిలోని ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో నూతనంగా ఏర్పాటు చేసిన పోలీస్ స్టేషన్ను రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, జిల్లా కలెక్టర్ గోపి, వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంఘనాథ్ తో కలిసి ఎమ్మెల్యే అరూరి రమేష్ ప్రారంభించారు. ఈసందర్భంగా నిర్వహించిన సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ… వరంగల్ ఏనుమముల మార్కెట్కి ఎంతో గొప్ప చరిత్ర ఉందని, దీన్ని కాపాడటం మనందరి బాధ్యత అన్నారు. గతంలో ఉన్న పరిస్థితులకు ఇప్పటి పోలీస్ స్టేషన్ల పరిస్థితిలో ఎన్నో మార్పులు వచ్చాయని, గత ప్రభుత్వాల హయాంలో పోలీస్ స్టేష న్లకు కనీస వాహన సౌకర్యం కూడా లేదన్నారు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ప్రతి పోలీస్ స్టేషన్ కీ ప్రభుత్వం వాహన సదుపాయం, ఖర్చులకి నిధులను ఇస్తుందన్నారు. హోమ్ గార్డ్ ల జీతాన్ని పెంచి వా రి గౌరవాన్ని కాపాడారన్నారు. గతంలో ఏదైనా కేసును ఛేదించటంలో ఎన్నో రోజులు పట్టేదని, కానీ ఇప్పుడు ప్రతి కేసు త్వరగా పరిష్కారం అవుతున్నదన్నారు. రైతుల సమస్యలను పరిష్కరించడంలో పోలీసులు ముందంజలో ఉండాలన్నారు. ప్రజల మన్ననలు పొందడానికి పోలీసులు కృషి చేయాలని ఆయన కోరారు.
చాలా సంతోషం : అరూరి
ఆసియాలోనే అతి పెద్ద మార్కెట్ అయిన ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో పోలీస్ స్టేషన్ ప్రారంభించడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే అరూరి రమేష్ తెలిపారు. నూతన పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు సహకరించిన మంత్రితోపాటు ప్రతీ ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణలో ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలకు తావులేకుండా నేడు పక్క రాష్ట్రాలకు కూడా మన పోలీస్ వ్యవస్థ ఐకాన్ గా మారిందన్నారు. అన్నీ రంగాల్లో వరంగల్ జిల్లా వేగంగా అభివృద్ధి చెందుతుండటంతో ఎన్నో కంపెనీలు పెట్టుబడి పెట్టేందుకు ముందుకొస్తున్నాయన్నారు.
కీలకమైన పోలీస్ స్టేషన్ : సీపీ
చుట్టూ ఉన్న 15 గ్రామాల ప్రజలకీ, రైతులకు ఏనుమాముల పోలీస్ స్టేషన్ ఎంతో కీలకమని, ఈ పోలీస్ స్టేషన్ వల్ల ఎంతో మేలు జరుగుతుందని సీపీ ఏవీ రంగనాథ్ అన్నారు. హైదరాబాద్ తర్వాత వరంగల్ న గరం వేగంగా అభివృద్ధి చెందుతున్న క్రమంలో రానున్న రోజుల్లో ట్రాఫిక్, ఇతరత్రా సమస్యలు కూడా త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ప్రజలకు చేరువయ్యే ఎన్నో కార్యక్రమాలను చేపడుతున్నామని సీపీ పేర్కొన్నారు.
24 గంటలు నిఘా అవసరం : కలెక్టర్ గోపి
మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ఏనుమాములో పోలీస్ స్టేషన్ భవనాన్ని నిర్మించారని, ఈ ప్రాంతంలో పోలీస్ స్టేషన్ తప్పకుండా ఉండాలని, 24 గంటలు పోలీస్ నిఘా అవసరం అని వరంగల్ కలెక్టర్ గోపి అన్నారు. ఈ కార్యక్రమంలో డీసీపీ వెంకట లక్ష్మి, ఏసీపీ నరేష్, కార్పొరేటర్ తూర్పటి సులోచన సారయ్య, పోలీస్ అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, వర్తక సంఘం నాయకులు, రైతులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
పరిధి గ్రామాలివే..
వరంగల్ పోలీస్ కమిషనరేట్ లో నూతనంగా ప్రారంభించిన ఏనుమాముల పోలీస్ స్టేషన్ పరిధిలో
రెడ్డిపాలెం, కారల్ మార్క్స్ నగర్, ఏనుమాముల, ఎన్టీఆర్ నగర్, సుందరయ్య నగర్, బాలాజీ నగర్, గణేష్ నగర్, ఎస్సార్ నగర్, మణికంఠ కాలనీ, ఇందిరమ్మ కాలనీ, సాయి గణపతి, లక్ష్మీ గణపతి కాలనీ, ఏనుమాముల మార్కెట్, పైడిపల్లి, ఆరేపల్లి, కొత్తపేట్ గ్రామాలు ఉంటాయి. ఒక ఇన్స్పెక్టర్ తో పాటు ఏనుమాముల పోలీస్ స్టేషన్ లో ముగ్గురు ఏఎస్సైలు, ఐదుగురు హెడ్ కానిస్టేబుళ్లు, 8 మంది కానిస్టేబుళ్లు విధులు నిర్వహించునున్నారు.