- బహుజన విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కేయూలో నిరసన
- బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహానికి వినతి
అక్షరశక్తి, హన్మకొండ: వరంగల్ పార్లమెంట్ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ మాదిగలకే కేటాయించి సామాజిక న్యాయం చేయాలని బహుజన విద్యార్థి సంఘాల నాయకులు అధిష్టానాన్ని కోరారు. ఈమేరకు శుక్రవారం విద్యార్థులు కాకతీయ యూనివర్సిటీలో వినూత్న రీతిలో నిరసన తెలిపారు. బాబూ జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా బహుజన విద్యార్థి నాయకుడు దూడపాక అశోక్ కుమార్ జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం అశోక్ కుమార్ మాట్లాడుతూ.. వరంగల్ పార్లమెంట్ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ మాదిగలకు కేటాయించాలని కోరారు. తెలంగాణ రాష్టంలో జనాభాలో అధిక శాతంగా ఉన్న మాదిగలకు రాజకీయపరంగా అన్యాయం జరుగుతోందన్నారు. వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి ఎంపికపై హైకమాండ్ పునరాలోచన చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం జగ్జీవన్ రామ్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో కాకతీయ యూనివర్సిటీ ఏబీఎస్ఎఫ్ అధ్యక్షులు మచ్చ పవన్ కళ్యాణ్, పరకాల ఎస్ సి సెల్ సలహా దారులు పురెళ్ళ సిద్దు, అజయ్, పృథ్వీరాజ్, సాయి, మల్లికార్జున, నరేష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Must Read