- ఖాతాదారులకు చుక్కలు చూపిస్తున్న చిట్ఫండ్ కంపెనీ
- చిట్టీ ముగిసినా అందని డబ్బులు
- నెలలు, ఏళ్లకొద్దీ కార్యాలయం చుట్టూ తిరుగుతున్న వైనం
- హన్మకొండలో సెంట్రల్ కార్యాలయాన్ని ముట్టడించిన ఖాతాదారులు
- ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆందోళన
అక్షరశక్తి, హన్మకొండ క్రైం : ఖాతాదారుల జీవితాలతో చిట్ఫండ్ కంపెనీలు చెలగాటమాడుతున్నాయి. రూపాయి రూపాయి కూడబెట్టిన సొమ్మును అప్పనంగా కాజేస్తున్నాయి. చిట్టీ ముగిసి ఏళ్లుగడుస్తున్నా ఖాతాదారులకు తిరిగి డబ్బులు ఇవ్వకుండా నరకం చూపిస్తున్నాయి. చెక్కులిస్తారుగానీ.. బ్యాంకులో మాత్రం డబ్బులుండవు.. ఇదేమిటని అడిగితే.. ఏం చేస్తారో.. చేస్కోండి.. అన్నట్లుగా వరంగల్ మహానగరంలోని పలు చిట్ఫండ్ కంపెనీలు బరితెగిస్తున్నాయి. ఖాతాదారుల సొమ్మును ఇతర వ్యాపారాలకు మళ్లించి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. డబ్బులడితే.. రేపుమాపు.. అంటూ ఏళ్లు గడుపుతున్నాయిగానీ.. రూపాయి మాత్రం తిరిగి ఇవ్వడం లేదు. ఇలా, నిత్యం ఏదో ఒక చోట చిట్ఫండ్ మోసాలు బట్టబయలవుతూనే ఉన్నాయి. తాజాగా… హన్మకొండలో భవితశ్రీ చిట్ఫండ్ కంపెనీ బాగోతం మరోసారి బయటపడింది. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన పలువురు ఖాతాదారులు భవితశ్రీ సెంట్రల్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. కార్యాలయంలోని సిబ్బందిని నిలదీశారు. తమకు డబ్బులు ఎందుకు ఇవ్వడంలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఆందోళన చేపట్టారు. కార్యాలయానికి ఏజీఎం చేరుకుని ఖాతాదారులకు తనదైన శైలిలో నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.
- ఖాతాదారుల ఆందోళన
హనుమకొండలోని భవిత శ్రీ చిట్ఫండ్స్ హెడ్ ఆఫీస్ను ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి తరలివచ్చిన బాధితులు మంగళవారం ఉదయం ముట్టడించారు. ఉదయం నుంచి రాత్రి వరకు కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. బాధితుల దగ్గర నిర్దాక్షిణ్యంగా ముక్కు పిండి వసూలు చేసుకుని కాలపరిమితి ముగిసిన కూడా ఏదో చెల్లని చెక్కులను ఇచ్చి కాలయాపన చేస్తున్నారే తప్ప డబ్బులు తిరిగి ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత మూడు సంవత్సరాల నుండి చిట్ ఫండ్స్ పేరా డబ్బులు వసూలు చేసుకుని గడువు దాటినా కూడా బాధితులకు డబ్బులు ఇవ్వకుండా గత రెండు సంవత్సరాల నుంచి తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ మండిపడ్డారు. సుమారు 50 మంది బాధితులు ఆఫీసుకు వచ్చి సిబ్బందిని నిలదీశారు. ఉదయం పది గంటల నుండి రాత్రి వరకు కార్యాలయంలోనే ఆందోళన చేపట్టగా చివరకు… ఏజీఎం వచ్చి.. ఏదో నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. బాధితులైన శ్యామసుందర్ రెడ్డి( మొగుళ్ళపల్లి), తాత సంపత్ (తొర్రూర్) తదితరులు కార్యాలయంలోనే బైఠాయించారు. పరకాల జనగాం బ్రాంచ్లకు సంబంధించిన బాధితులకు సుమారు కోటి రూపాయలు ఇవ్వకుండా.. కనీసం ఎటువంటి హామీ ఇవ్వకపోవడమేగాక దురుసుగా ప్రవర్తించారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.