- ములుగు జిల్లాకు 40బస్తాల బియ్యం తరలింపు
- ఎమ్మెల్యే సీతక్క సమక్షంలో బాధిత కుటుంబాలకు అందజేత
అక్షరశక్తి, గూడూరు : ఇటీవల భారీ వర్షాలతో సర్వ కోల్పోయిన వరదబాధితులను ఆదుకోవడానికి అనేకమంది ముందుకువస్తున్నారు. అక్కడి ప్రజల కష్టాలను పంచుకోవడానికి ఎవరిస్థాయిలో వారు సాయం అందిస్తున్నారు. పుట్టెడుదుఃఖంలో మునిగిపోయిన ములుగు జిల్లా మేడారం, కొండాయి, దొడ్ల, మోరంచపల్లి గ్రామాల జనానికి అండగా నిలుస్తున్నారు. ఇళ్లు కొట్టుకుపోయి.. తాగేందుకు నీళ్లులేక, తినేందుకు తిండిలేక, ఉండేందుకు నిలవనీడలేక కన్నీటిపర్యంతమవుతున్న వారికి మహబూబాబాద్ జిల్లా గూడూరుకు చెందినటువంటి 1998-99 పదవతరగతి మిత్రబృదం సాయం అందించింది. ఆయా గ్రామాల ప్రజల దయనీయ పరిస్థితులకు చలించిపోయారు. గూడూరు నుంచి 40బస్తాల బియ్యాన్ని అక్కడికి తరలించి ములుగు ఎమ్మెల్యే సీతక్క సమక్షంలో వరదబాధిత కుటుంబాలకు అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ.. బుడిగె సతీష్తోపాటు మిత్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఆపదలో ఉన్న ములుగు జిల్లా ప్రజలకు ఎంతోదూరం నుంచి వచ్చి సాయం అందించడం గొప్పవిషయమని అభినందించారు. ఈ కార్యక్రమంలో బుడిగె సతీష్, అబ్బు మహేందర్ రెడ్డి, డాక్టర్ దుడే నరేష్, మందుల శ్రావణ్, పేరాల రాము, ముంజాలా పూర్ణచందర్, బత్తుల శ్రీనివాస్, ఐనవోలు శ్రీధర్, బురాన్, గోరెబాబు, గజ్జి మల్లయ్య, సమ్మెట స్వామి తదితరులు పాల్గొన్నారు.