- భయాందోళనలో ముంపు కాలనీల ప్రజలు
- పరిశీలించిన కలెక్టర్, కమిషనర్
అక్షరశక్తి, హన్మకొండ: వరంగల్ నగరంలో నడిబొడ్డున గల చారిత్రక భద్రకాళి చెరువుకు గండిపడింది. వరద పోటెత్తడంతో శనివారం ఉదయం పోతననగర్వైపు కట్ట తెగింది. వరద నీటితో పోతననగర్, సరస్వతి నగర్, కాపువాడకు ప్రమాదం పొంచి ఉండటంతో ఆయా కాలనీల ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. భద్రకాళి చెరువు సమీప కాలనీల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. యుద్ద ప్రాతిపదికన మరమ్మతు పనులు చేపడుతున్నారు.
పరిశీలించిన కలెక్టర్, కమిషనర్
వరంగల్ భద్రకాళి చెరువుకు గండి పడటంతో ముంపు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. భద్రకాళి కట్ట సమీపంలో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. కాపువాడ ప్రజలను సైతం అప్రమత్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. భద్రకాళి చెరువు మత్తడి వైపు సైతం మరో బుంగ పడినట్లు సమాచారం. భద్రకాళి చెరువుకు పడిన గండిని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ షేక్ రిజ్వాన్ పాషా సందర్శించి పరిశీలించారు. సమీప కాలనీలైన కాపువాడ, పోతన నగర్ వాసులను అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశాలు జారీ చేశారు.