- ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమే..
- భారత నాస్తిక సమాజం జాతీయ అధ్యక్షుడు జీడి సారయ్య
- జనగామ కలెక్టర్, డీఈవో తీరుపై ఆగ్రహం
అక్షరశక్తి, వరంగల్ : విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించాల్సింది పోయి.. మూఢనమ్మకాలకు పెద్దపీట వేసే విధంగా దేవాలయం ప్రారంభోత్సవానికి విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్దమని భారత నాస్తిక సమాజం జాతీయ అధ్యక్షుడు జీడి సారయ్య విమర్శించారు. జనగామ జిల్లా పాలకుర్తి మండలం వల్మిడీలో శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయ ప్రారంభోత్సవం సందర్భంగా జిల్లాలోని విద్యా సంస్థలకు కలెక్టర్ ఆదేశాల మేరకు డీఈవో సెలవులు ప్రకటించడంపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇది విద్యార్థులను చదువుకు దూరం చేయడమేనని ఆవేదన వ్యక్తం చేశారు. ఓవైపు విశ్వరహస్యాలను తెలుసుకోవడానికి ఉప గ్రహాలను ప్రయోగిస్తూ.. ప్రపంచంలోనే ముందువరుసలో మనం ఉంటున్నామని, ఇదే సమయంలో కల్పితాలతో రూపొందించినటువంటి కట్టుకథలకు పెద్దపీట వేస్తూ దేవాలయాల ప్రారంభోత్సవాల సందర్భంగా విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించడం సైన్స్ను, శాస్త్రీయ సమాజాన్ని అవమానించినట్టేనని ఆయన అన్నారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 51ఎ(హెచ్) ప్రకారం పౌరుల్లో శాస్త్రీయ దృక్పథం, మానవతావాదం, పరిశీలన, సంస్కరణ స్ఫూర్తిని అభివృద్ధి చేయాలని, కానీ, నేటి పాలకులు దానిని తుంగలో తొక్కి పౌరులను మూఢత్వంలోకి నెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సెక్యులర్గా ఉంటూ రాజ్యాంగాన్ని కాపాడాల్సిన ఐఏఎస్ అధికారులు, డీఈవోలు సహితం.. విద్యార్థుల మెదళ్లలో మతబీజాలు నాటుతూ వారి భవిష్యత్ను అంధకారం చేస్తున్నారంటూ జనగామ జిల్లా కలెక్టర్, డీఈవోపై జీడి సారయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత దేశం సెక్యులర్ దేశమని, ఇక్కడ మతప్రమేయంలేని పాలన జరిగినప్పుడు మాత్రమే దేశం సంపూర్ణ ప్రగతిని సాధించడం సాధ్యమవుతుందని అన్నారు ఒకవైపు సాంకేతికంగా ప్రపంచంతో పోటీ పడుతూ.. చంద్రయాన్ -3 విజయవంతం చేశారంటూ గర్వపడుతున్న క్రమంలో దానికి సమాంతరంగా ఈ పాలకులు మతమూఢవిశ్వాలను పెంపొందించడం ఈదేశం సామాజిక వెనకబాటుకు అద్దంపడుతోందని పేర్కొన్నారు. మతములన్నియు మాసిపోవును.. జ్ఞానమొక్కటే నిలిచి వెలుగును.. అంటూ ప్రముఖ కవి గురజాడ అప్పారావు చెప్పిన మాటలను తరగతి గదులకే పరిమితం చేయకుండా ఆచరణలోకి తీసుకురావడం వల్ల భవిష్యత్తరాలు గొప్పగా ఎదిగే అవకాశం ఉంటుందని జీడి సారయ్య అన్నారు.