- వరంగల్ తూర్పు బీజేపీ టికెట్ కోసం అల్లం నాగరాజు ప్రయత్నం
- స్థానికుడిగా అన్నివర్గాల ప్రజల్లో గుర్తింపు
- న్యాయవాదిగా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర
- బీసీ సంఘాల్లో చురుకైన నేతగా ఆదరణ
- విద్యార్థి దశ నుంచే హిందూధర్మ పరిరక్షణకు కృషి
- రాష్ట్రంలోనే అతిపెద్ద గోశాల నిర్వహణ
- పార్టీ అగ్రనేతల పరిశీలనలో నాగరాజు పేరు!
అక్షరశక్తి, వరంగల్ : వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి ప్రముఖ న్యాయవాది, తెలంగాణ ఉద్యమకారుడు అల్లం నాగరాజు బరిలోకి దిగే దిశగా అడుగులు వేస్తున్నారా..? విద్యార్థి దశ నుంచే హిందూధర్మ పరిరక్షకుడిగా, బీసీ వకీల్సాబ్గా అన్నివర్గాల ప్రజల్లో గుర్తింపు సాధించిన ఆయన.. బీజేపీ టికెట్ కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారా..? వరంగల్ తూర్పులో కాషాయజెండా ఎగరవేయాలన్న పట్టుదలతో ఉన్న పార్టీ అగ్రనేతలు.. స్థానికుడు నాగరాజు పేరును కూడా పరిశీలనలోకి తీసుకున్నారా..? ఈ సానుకూల సంకేతాలతోనే ఆయన కూడా వరంగల్ తూర్పు టికెట్ కోసం దరఖాస్తు చేసుకోబోతున్నారా..? అంటే.. తాజాగా చోటుచేసుకుంటున్న పరిణామాలు ఔననే అంటున్నాయి. ప్రస్తుతం బీజేపీ వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం జాయింట్ కన్వీనర్గా కొనసాగుతున్న నాగరాజు పార్టీ చేపడుతున్న ప్రతీ కార్యక్రమంలోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రధానంగా తరుణ్చుగ్, సునీల్బన్సాలీ, బీఎల్వర్మ, ఈటల రాజేందర్లాంటి అగ్రనేతల పర్యటనలను విజయవంతం చేయడంలో ఆయన ముందువరుసలో నిలుస్తున్నారు.
- స్థానికుడిగా అన్నివర్గాల్లో గుర్తింపు
ఖిలావరంగల్ తూర్పుకోటలో అల్లం నాగరాజు పుట్టిపెరిగారు. ఇక్కడే విద్యాభ్యాసం పూర్తి చేశారు. పదో తరగతి వరకు మహబూబియా స్కూల్, ఎల్బీ కళాశాలలో డిగ్రీ, పీజీ, కేయూలో ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం పూర్తి చేశారు. ఇంటర్ నుంచే ఏబీవీపీ విద్యార్థి నేతగా ఎదిగారు. ఆ తర్వాత న్యాయవాద వృత్తిలోకి అడుగుపెట్టి.. అనతికాలంలోనే మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు. ఈ క్రమంలో ఉమ్మడి వరంగల్ వరంగల్ బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగానూ పనిచేశారు. బీసీ న్యాయవాదుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. స్థానికుడిగా.. వరంగల్ తూర్పు నియోజకవర్గ ప్రజ సమస్యల పరిష్కారం కోసం తనవంతు కృషి చేస్తున్నారు. ఇటీవల బీసీ నినాదం బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో బీజేపీ కూడా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ ఎజెండాగా ముందుకు వెళ్లే వ్యూహంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఈక్రమంలోనే వరంగల్ తూర్పులో అల్లం నాగరాజు పేరును కూడా పరిశీలనలోకి తీసుకున్నట్లు సమాచారం. పార్టీ అగ్రనేతల్లో మంచి గుర్తింపు పొందిన ఆయన.. పార్టీ టికెట్ కోసం దరఖాస్తు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. - తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర
తెలంగాణ ఉద్యమంలో న్యాయవాదిగా అల్లం నాగరాజు అత్యంత కీలక పాత్ర పోషించారు. మిలియన్మార్చ్ విజయవంతం కోసం అహర్నిశలు శ్రమించారు. ప్రధానంగా ఛలో ఢిల్లీ కార్యక్రమానికి ఇక్కడి నుంచి సుమారు 100మంది న్యాయవాదులను తరలించారు. ఉద్యమంలో భాగంగా వంటావార్పూ, రైలు రోకో, రాస్తారోకోలు అనేకం చేపట్టారు. పోలీసు లాఠీదెబ్బలు తిన్నారు. జైలుకు వెళ్లినా.. వెనకడుగు వేయకుండా ఉద్యమంలో ముందుకు కదిలారు. ఉమ్మడి హైకోర్టు విభజన కోసం ఉద్యమించి జైలుకు కూడా వెళ్లారు. ప్రధానంగా, తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులపై అక్రమంగా నమోదు అయిన కేసులను వాదించేందుకు న్యాయవాద బృందంగా ఏర్పడి ఉచితంగా సేవలు అందించారు. ఇందుకోసం రాత్రింబవళ్లు శ్రమించారు. అంతేగాకుండా, బీసీ రాజ్యాధికారమే లక్ష్యంగా బీసీలను ఐక్యం చేయడానికి అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇటీవల వరంగల్ తూర్పు నియోజకవర్గంలో బీజేపీ ఎన్నికల కమిటీ కన్వీనర్, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అధ్యక్షతన పార్టీలకతీతంగా కుల సంఘాల అధ్యక్షులను, విద్యార్థి సంఘాల నాయకులను, ప్రజాసంఘాల నేతలను ఏకతాటిపైకి తీసుకొచ్చి బీసీలకు రాజ్యాధికారం అనే నినాదంపై భారీ సదస్సు నిర్వహించారు. - విద్యార్థి దశ నుంచే హిందూధర్మ పరిరక్షకుడిగా..
అల్లం నాగరాజు విద్యార్థి దశ నుంచే హిందూధర్మ పరిరక్షణ కోసం పాటుపడుతున్నారు. ఏబీవీపీ విద్యార్థి నేతగా కొనసాగుతూనే… హిందూధర్మ పరిరక్షణ కార్యక్రమాలు చేపట్టారు. ప్రస్తుతం, రాష్ట్రంలోనే అతిపెద్ద గోశాలను నాగరాజు నిర్వహిస్తున్నారు. వశిష్టిసూర్య పేరుతో గోశాలను పంథిని-కక్కిరాలపల్లిలో నిర్వహిస్తున్నారు. ఇక్కడ ప్రతీనెల రెండుసార్లు యాగం నిర్వహిస్తున్నారు. దేశం నలుమూలల నుంచి అనేక మంది ప్రముఖులు ఈ గోశాలను సందర్శించి వెళ్తున్నారు.