- పార్టీకి పొన్నాల లక్ష్మయ్య రాజీనామా
- అధిష్ఠానానికి లేఖ
- సీనియర్లకూ అపాయింట్మెంట్ ఇవ్వడంలేదని ఆరోపణ
- బీసీలకు అన్యాయం జరుగుతుందంటూ ఆవేదన
- జనగామ కాంగ్రెస్లో కలకలం
అక్షరశక్తి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. టిపిసిసి మాజీ అధ్యక్షుడు, సమాచార సాంకేతిక శాఖ మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య శుక్రవారం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. జనగామ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసేందుకు టికెట్ నిరాకరించిన కారణంగానే ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్లు సమాచారం. తన రాజీనామా లేఖను అధిష్ఠానానికి పంపారు. పార్టీ అంశాలు చర్చించేందుకు కూడా అవకాశం ఇవ్వడం లేదని లేఖలో పేర్కొన్నారు. పార్టీలో బీసీలకు అన్యాయం జరుగుతుందని పొన్నాల ఆరోపించారు. కొందరు నేతల వైఖరితో పార్టీ పరువు మట్టిలో కలుస్తోందన్నారు. ఉదయ్ పూర్ డిక్లరేషన్ అమలు చేయడం లేదని పేర్కొన్నారు. అవమానాలు ఎదుర్కొని పార్టీలో ఉండలేనన్నారు. సీనియర్లకు కూడా అధిష్ఠానం అపాయింట్ మెంట్ ఇవ్వట్లేదని పొన్నాల ఆవేదన వ్యక్తం చేశారు. నెలల తరబడి అపాయింట్ మెంట్ ఇవ్వకుండా అవమానించారని పొన్నాల పేర్కొన్నారు. పొన్నాల లక్ష్మయ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ కేబినెట్లో మంత్రిగా పని చేశారు. అనంతరం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పీసీసీ అధ్యక్షుడిగా పని చేశారు. జనగామ టికెట్ విషయంలో అసంతృప్తితోనే పొన్నాల రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. కాగా, పొన్నాల బీఆర్ఎస్లో చేరుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ‘‘45 ఏళ్ల రాజకీయ జీవితం నాది. పేద కుటుంబం నుంచి ఈ స్థాయికి వచ్చా. 45 ఏళ్ల తర్వాత తీసుకున్న ఈ నిర్ణయం బాధాకరంగా ఉంది. ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో అందరికీ తెలిసిన విషయమే. నా విషయంలోనే ఇలా ఎందుకు జరిగిందో అర్థం కావట్లేదు.’’ అంటూ పొన్నాల భావోద్వేగానికి గురయ్యారు. ఈ పరిణామాలతో జనగామ కాంగ్రెస్ పార్టీలో కలకలం రేగుతోంది.