- ఇండియా కూటమి తరుపున పోటీకి ఆసక్తి..
- సీపీఐ నేతలు నారాయణ, కూనంనేనిని కలిసి విజ్ఙప్తి..
- సానుకూలంగా స్పందించిన నాయకులు
- సీనియర్ జర్నలిస్టుగా, జర్నలిస్టు యూనియన్ నేతగా గుర్తింపు
- ప్రజా నాయకుడు, దివంగత సీపీఐ నేత భగవాన్దాస్ వారసుడిగా పేరు..
- పార్టీ ఆదేశిస్తే పోటీకి రెడీ అంటున్న లెనిన్
అక్షరశక్తి, హన్మకొండ: సీనియర్ జర్నలిస్ట్, టీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షుడు బీఆర్ లెనిన్ సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావును హైదరాబాద్లోని పార్టీ కార్యాలయంలో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఇండియా కూటమి వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా తన పేరు పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. ఈసందర్భగా నారాయణ, కూనంనేని సాంబశివరావు సానుకూలంగా స్పందించారు. తాము అడిగే స్థానంలో వరంగల్ ఉందని, పోటీకి సిద్ధంగా ఉండాలని తెలిపారు. దివంగత సీపీఐ సీనియర్ నేత, ప్రజా నాయకుడు బీఆర్ భగవాన్దాస్ తనయుడిగా, సీనియర్ జర్నలిస్టుగా లెనిన్కు ఉమ్మడి వరంగల్ జిల్లాలో గుర్తింపు ఉంది. జర్నలిస్ట్ యూనియన్ నేతగా రాష్ట్రవ్యాప్తంగా పేరుంది. ఈక్రమంలోనే త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఇండియా కూటమి తరుపున పోటీ చేసేందుకు లెనిన్ ఆసక్తి కనబరుస్తున్నారు. పార్టీ ఆదేశిస్తే పోటీ చేసేందుకు రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది.
Must Read