- చేతులు కలిసినా మనసులు కలవలే..!
- ఎడమొహం పెడమొహంగా గండ్రా, చారి వర్గీయులు
- భూపాలపల్లి బీఆర్ఎస్లో తీవ్రస్థాయిలో అసమ్మతి
- ఎమ్మెల్యేపై ప్రతీకారం కోసం అదునుచూస్తున్న గులాబీ నేతలు
- గండ్రకు సపోర్ట్ చేసేది లేదంటున్న చారి వర్గీయులు
- ఆందోళనలో ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి
- కలవరపెడుతున్న తాజా రాజకీయ పరిణామాలు
అక్షరశక్తి, భూపాలపల్లి : భూపాలపల్లి నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు రోజురోజుకూ ఆసక్తికరంగా మారుతున్నాయి. ము ఖ్యంగా సిట్టింగ్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి గండ్ర వెంకట రమణారెడ్డిని తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇన్నిరోజులు ఎమ్మెల్యే వెంట నడిచిన ప్రజాప్రతినిధులు ఒక్కొక్కరుగా కాంగ్రెస్ కండువా క ప్పుకుంటుండటం మింగుడుపడని అంశమైతే.. మరోపక్క మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ సిరికొండ మధు సూదనాచారి అనుచరులు మండలాల్లో ఎమ్మెల్యేకు సహకరించకపోవడం గండ్రకు తలనొప్పిగా మారింది. ఈక్రమంలోనే ఎమ్మెల్యే గండ్రకు పూర్తిగా సహకరిస్తామని ఆయన గెలుపు కోసం అంతా కలిసి పనిచేస్తామని చారి బహిరంగంగా సంకేతాలచ్చినప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. ఏ దేమైనా ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యే గండ్రకు సహకరించేదిలేదని చారి అనుచరులు బహిరంగంగానే తెగేసి చెబుతున్నారు. ఐదేండ్లు మమ్మల్ని పదవులకు దూరంచేసి, అక్రమంగా కేసులపాలుచేసి, పార్టీకి నష్టం చేసి తీరా ఎన్నికల సమయంలో కలిసి పనిచేద్దాం అంటే ఎలా కుదురుతుందని ప్రశ్నిస్తున్నారు. ఇన్ని రోజులు పార్టీ పదవులకు, నామినేటెడ్ పోస్టులకు పనికిరాని తాము ఎమ్మెల్యే రమణారెడ్డికి ఎలా సపోర్ట్ చేస్తామని చారి అనుచరులు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం. భూపాలపల్లిలో ఈసారి కాం గ్రెస్ తుఫాన్ రాబోతోందన్న ప్రచారం నేపథ్యంలోనే సొంత పార్టీ నేతల నుంచి సహకారం అందక పోవడంతో ఎమ్మెల్యే సాబ్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తీరా ఎన్నికల ముంగిట చోటుచేసుకుంటున్న పరిణామాలతో తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
కింది క్యాడర్ సహకరించేనా..?
2018 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గండ్ర వెంకట రమణారెడ్డి, టీఆర్ఎస్ నుంచి సిరికొండ మధుసూదనాచారి పోటీ పడగా వెంకట రమణారెడ్డి విజయం సాధించారు. అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల నేప థ్యంలో గండ్ర టీఆర్ఎస్లో చేరారు. అప్పటి నుంచి నియోజకవర్గంలో తన అధిపత్యాన్ని కొనసాగిస్తూ వ చ్చారు. అయితే సీఎం కేసీఆర్ చారికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి సర్ది చెప్పారు. పార్టీలో చేరినప్పటి నుంచే గండ్ర వెంకట రమణారెడ్డి తన అనుచరగణాన్ని పార్టీ మండల అధ్యక్షులు, గ్రామ అధ్యక్షులతోపాటు నామినేటెడ్ పోస్టుల్లో నియమించుకుంటూ నియోజకవర్గంలో తన ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. ఈ క్రమంలోనే చారి అనుచరులను పార్టీకి, నామినేటెడ్ పదవులకు దూరంగా పెట్టాడు. అంతేగాక.. పలు మండలాల్లో ముఖ్యమైన నాయకులపై అక్రమ కేసులు కూడా బనాయించి మానసికంగా వేధింపులకు గురిచేశారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇదే ఇప్పుడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే గండ్ర వెంకట రామారెడ్డికి శాపంగా మారింది. టేకుమట్ల, చిట్యాల, గణపురం, భూపాలపల్లి, మొగుళ్లపల్లి, శాయంపేట మండలాల్లో మెజార్టీ ప్రజాప్రతినిధులు గండ్ర వెంకటరమణారెడ్డికి మద్దతు ప్రకటించకుండా సైలెంట్గా ఉంటున్నారు.
విజయాన్ని నిర్ణయించేది చారి ఓట్లే..
2014, 18 ఎన్నికల్లో గండ్ర వెంకటరమణారెడ్డి, సిరికొండ మధుసూదనాచారి, గండ్ర సత్యనారాయణరావు ముగ్గురికి సైతం 50 వేలకు పైచిలుకు ఓట్లు పడ్డాయి. ప్రస్తుతం ఈ ఎన్నికల్లో మధుసూదనాచారి పోటీ చేయడం లేదు. దీంతో ఆ 50,000 ఓట్లు ఎవరికి పడతాయని రాజకీయ పరిస్థితులు పరిశీలకులు అంచనా వేయలేకపోతున్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సిరికొండ మధుసూదనాచారి గండ్రకు మద్దతు తెలుపుతున్నప్పటికీ అన్ని మండలాల్లో చారి అనుచరులు మెజార్టీగా గండ్రకు సహకరించడంలేదు.
పార్టీ పదవులతోపాటు నామినేటెడ్ పోస్టులు టాయించకపోవడమే కాకుండా కొందరిపై అక్రమ కేసులు కూడా బనాయించారని అపవాదు ఎమ్మెల్యేపై బలంగా ఉంది. ఈనేపథ్యంలో చారి అనుచరులు బీఆర్ఎస్ అభ్యర్థి రమణారెడ్డికి పూర్తిస్థాయిలో సహకరించకపోవచ్చునే అభిప్రాయాలు నియోజకవర్గంలో బలంగా వి నిపిస్తున్నాయి. ఇదే నిజమైతే ఎన్నికల్లో ఎమ్మెల్యే గండ్రకు ఎదురుదెబ్బ తగలడం ఖాయంగా కనిపిస్తోంది.
సింగరేణి కార్మికుల్లో సైతం..
భూపాలపల్లిలో సింగరేణి కార్మికులు జయపజయాలను నిర్ణయించడంలో కీలకంగా ఉంటారు. అయితే వీరు అధికార పార్టీ బీఆర్ఎస్పై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ అనుబంధ సంఘ మైన టీవీజీకేఎస్ గత సింగరేణి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయలేదని కార్మికులంతా ఆగ్రహంతో ఉన్నారు. ఈ పరిణామం సైతం అధికార పార్టీ అభ్యర్థికి మైనస్గా మారనుంది. గత అసెంబ్లీ ఎ న్నికల్లో సైతం రాష్ట్రంలోని సింగరేణి ప్రాంత అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ అధికార పార్టీకి వ్యతిరేకంగా తీర్పు చెప్పారు. భూపాలపల్లిలోనూ అప్పుడు అధికార పార్టీ అభ్యర్థి చారికి వ్యతిరేకంగా సింగరేణి కార్మికులు పనిచేశారు. ఇప్పుడు సైతం బీఆర్ఎస్ను ఓడించేందుకు కార్మికులు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండగా అటు నియోజకవర్గంలో ఇటు పార్టీలో చోటుచేసుకుంటున్న తాజా పరిణామాలు ఎమ్మెల్యే గండ్రకు నిద్రపట్టనివ్వడంలేదు.