అక్షరశక్తి, భూపాలపల్లి : మాజీ మావోయిస్టు నేతకు కాంగ్రెస్ పార్టీ కీలక బాధ్యతలు అప్పగించింది. టీ పీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెలశాల గ్రామానికి చెందిన గాదర్ల అశోక్ను నియమించింది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ మహేశ్కుమార్ గౌడ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మూడు దశాబ్దాలకుపైగా విప్లవోద్యమం జీవితం గడిపిన గాదర్ల అశోక్ అలియాస్ ఐతు పీపుల్స్వార్ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారు. రాష్ట్ర, కేంద్ర కమిటీల్లో కీలక బాధ్యతలు చేపట్టారు. వ్యక్తిగత కారణాలతో 2016లో పోలీసులకు లొంగిపోయి సాధారణ జీవితం గడిపారు. ఈక్రమంలోనే ఇటీవల పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అ భ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ ప్రచారం చేపడుతున్నారు. పార్టీకి అందిస్తున్న సేవలు గుర్తించిన కాంగ్రెస్ అశోక్కు రాష్ట్ర అధికార ప్రతినిధిగా కీలక బాధ్యతలు అప్పగించింది. పరకాల కాంగ్రెస్ టికెట్ ఆశించి కాంగ్రెస్లో చేరిన గాదర్ల అశోక్ అలియాస్ ఐతుకు పరకాల, భూపాలపల్లి, ములుగు, మంథని, పాలకుర్తి, స్టేషన్ ఘన్ పూర్, మహబూబాబాద్ తదితర నియోజకవర్గాల్లో మంచి పరిచయాలున్నాయి. ఉద్యమ పయనంలో ఆయన ఆయా నియోజకవర్గాల్లో మావోయిస్ట్ పార్టీ వివిధ హోదాల్లో పని చేయగా.. తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. అశోక్కు పీసీసీ అధికార ప్రతినిధిగా బాధ్యతలు అప్పగించడం ద్వారా ఆయా నియోజకవర్గాల్లో పార్టీకి మంచి మైలేజ్ వస్తుందని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఈసందర్భంగా అశోక్ మాట్లాడుతూ… తన నియామకానికి సహకరించిన పీసీసీ ప్రసిడెంట్ రేవంత్రెడ్డి, భూపాలపల్లి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గండ్ర సత్యనారాయణరావు, ములుగు ఎమ్మెల్యే సీతక్కకు కృతజ్ఞతలు తెలిపారు.